అమరావతి : బీటెక్ విద్యార్థిని రమ్య హత్య చాలా బాధాకరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జీజీహెచ్లో రమ్య మృతదేహాన్ని మంత్రి సుచరిత పరిశీలించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారని, సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. విచారణ త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్షపడేలా చూస్తామన్నారు. రమ్య ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఫోన్ను అన్లాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రమ్య హత్య పట్ల సీఎం జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.