అమరావతి : రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 637 దవాఖానల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
6870 ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా.. వీటిలో 547 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కర్నూల్ జిల్లాలో 281 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రం తన కోటాగా కింద రాష్ట్రానికి 590 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని చెప్పారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ త్వరలో కొవిడ్ వ్యాక్సినే వేస్తామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ‘‘45 ఏండ్లు దాటిన వారికి టీకా వేసేందుకు ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. అనుమతి రాగానే టీకా పంపిణీ ప్రారంభిస్తాం. కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రెగ్యులర్ నియామకాల్లో 15 శాతం వెయిటేజీ ఇస్తాం.
ఎవరికి, ఎప్పుడు టీకా ఇస్తున్నామనే విషయం ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. రెండో రౌండ్ వ్యాక్సినేషన్కు సరిపడా వ్యాక్సినే ఇప్పుడు అందుబాటులో ఉంది. తొలిరౌండ్ టీకా ఎప్పుడు వేస్తామనే విషయం మళ్లీ చెబుతాం. ప్రభుత్వం ప్రతిఒక్కరికీ ఉచితంగా టీకా అందిస్తుంది. కేంద్రం ఇచ్చినవి, రాష్ట్రం కొనుగోలు చేసిన టీకాలతో వ్యాక్సినేషన్ కొనసాగిస్తాం’’ అని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.