అమరావతి : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అమరాతి రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు.
కొందరు రైతులు కోర్టుకు వెళ్లడం వల్లే ప్లాట్ల అభివృద్ధి ఆలస్యమవుతున్నదని తెలిపారు. 500 వందలు కాదు.. వెయ్యి రోజులు ఉద్యమం చేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.
కరోనా వేళ ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, అన్ని విషయాలు అంగీకరించాకే ఉద్యోగులు పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులకే వర్క్ఫ్రం హోమ్ సాధ్యపడుతుందని, క్షేత్రస్థాయి పనుల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యం కాదని మంత్రి కుండబద్ధలు కొట్టారు. కొందరు వర్క్ఫ్రం హోమ్ ఇవ్వాలని అనడం అవివేకమని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.