ఈ ఏడాది రవితేజ మంచి జోరు మీదున్నాడు. క్రాక్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన మాస్ రాజా ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా విడుదల కాగా, ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఇక ఈ రోజు ఉగాది సందర్బంగా మరో సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. శరత్ మండవ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఇందులో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తుంది.
కొద్ది సేపటి క్రితం చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఏప్రిల్ నెలలోనే మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నామని నిర్మాతలు తెలియజేశారు. సామ్ సీఎస్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. దర్శకుడు శరత్ మండవ లండన్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి పలు తెలుగు, తమిళ చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ రానున్న రోజులలో బోయపాటితో ఓ చిత్రం, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.