అమరాతి : ఆంధ్రప్రదేశ్లో మరికాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా ఉధృతి కారణంగా ఏపీ ప్రభుత్వం గత నెల పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్తోపాటు సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఏపీలో మొత్తం 10,32,469 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. వీరిలో 5,12,959 మంది ఫస్టియర్ విద్యార్థులు, 5,19,510 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.