అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీస్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అంటే కానిస్టిట్యూషనల్ హెడ్ అని, అలాంటి ముఖ్యమంత్రిని, వాళ్ల తల్లినుద్దేశించి మాట్లాడుతున్న మాటలు, బూతులు తిట్టడాన్ని కూడా ఈ రోజు చూస్తున్నామన్నారు. ఇలా తిట్టడం సరైందేనా? ఇలా తిట్టినందుకు సీఎంను అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి.. వాళ్లు రెచ్చిపోవాలి.. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి.. దాంతో గొడవలు సృష్టించాలని ఆరాటపడడం.. ఇలాంటి దారుణాలు సమంజసమేనా? అని ప్రశ్నించిన ఆయన.. వాటిపై ఆలోచన చేయాలన్నారు.
లోకల్, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో అధికారంలోకి రాలేరని తేలిపోయింది, అందుకే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దిగజార్చుతూ.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలను కూడా డ్రగ్ బానిసలుగా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందని, ఇది అత్యంత దారుణమైన నేరం అన్నారు.
డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వివరణ ఇచ్చినా కూడా, చివరకు డీజీపీ పదే పదే చెప్పినా ఆరోపణలు చేస్తూనే ఉన్నారన్నారు. రూపం మార్చుకున్న అసాంఘిక శక్తులను రాజకీయ నాయకులుగా చూస్తున్నామని, రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు.