కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల లభ్యత గగనమవుతున్నది. సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎలాగూ చికిత్స అందుతుండగా, స్వల్ప లక్షణాలున్న వారు ఇంట్లో ఉండడానికి భయపడుతున్నారు. ఇలాంటి వారు హోటళ్లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. చక్కటి వసతి, మంచి ఆహారం, పర్యవేక్షించేందుకు వైద్యులు, నర్సులు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు.. హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకొని కొవిడ్ సేవలందిస్తున్నాయి. వసతి, సౌకర్యాలను బట్టి రోజుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు చార్జీ చేస్తున్నారు.
వారు.. ఎవరికి ఏమీ కారు. సమస్య వస్తే మాత్రం మేమున్నామంటూ భరోసా ఇస్తారు. ప్రస్తుత ఆపత్కాలంలో పాజిటివ్ వ్యక్తులకు సేవ చేయాలంటే పెద్ద మనసు ఉండాలి. రక్త సంబంధీకులే దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో వారు మాత్రం మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి కోలుకునే వరకు అన్నీ తామై చూసుకుంటున్నారు. అమ్మలా అన్నం పెడుతూ.. నాన్నలా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ చేయూతనిస్తున్నారు. వారే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సభ్యులు. కరోనా బాధితులకు సంరక్షకులు. పూర్తిగా కోలుకునే వరకు వారే బాధ్యత తీసుకుంటారు. ఒక్క కాల్ చేస్తే చాలు ఇక మన సమస్య వారిది అవుతుంది. ఆహారం నుంచి ఆరోగ్యం వరకు అన్ని జాగ్రత్తలు వారే తీసుకుంటారు. సేవలన్నీ ఉచితంగా అందించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
వారం కిందటే సేవలు ప్రారంభించాం. ఇప్పటి వరకు 3 వందలకు పైగా కాల్స్ వచ్చాయి. సాధ్యమైనంత వరకు అందరికీ సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా నిర్ధారణ అయ్యాక చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారికి మేం ధైర్యం చెబుతున్నాం. ఆర్థికంగా డబ్బలు లేక ఇబ్బందులు పడే వారికి మా సేవలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. – ముజ్తబ ఆస్కారి, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్