మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): అసలే కరోనా భయం తో జనం బెంబేలెత్తిపోతున్నారు. మామూలు జ్వరం వచ్చినా… అది కరోనాననే అనే ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వివిధ వార్తలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టినా పలుచోట్ల ప్రజలు మాత్రం భయపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటింటి సర్వే చేపట్టి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టారు. తొలిరోజు సర్వే విజయవంతంగా సాగింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి ఇంటిలోని సభ్యుల వివరాలను తెలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. ప్రతి వ్యక్తి వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకుని నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి వైద్య సహాయం అందిస్తున్నారు. దవాఖాన సేవలు అవసరం అయిన వారిని వెంటనే సమీప ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్నారు. కరోనాపై జనానికి సిబ్బంది అవగాహన సైతం కల్పిస్తున్నారు. వైరస్ సోకిన లక్షణాలతో ఉండి, వైద్యం చేయించుకోకుండా ఇంట్లోనే ఉన్న వారిని గుర్తించి వెంటనే దవాఖానకు తరలిస్తున్నారు. ఇంటింటి సర్వే వల్ల కొవిడ్ లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు రాకుండా ఉండే వారిని, చికిత్స చేయించుకోకుండా ఉన్న వారిని గుర్తించేందుకు అవకాశం ఏర్పడుతోంది.
మహబూబ్నగర్లో…
జిల్లాలో జ్వరం, వివిధ అనారోగ్యాల బారిన పడిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే తొలిరోజు విజయవంతంగా సాగింది మహబూబ్నగర్ జిల్లాలో ఇంటింటి సర్వే కోసం గ్రామాల పరిధిలో 630, పట్టణాల పరిధిలో 89 బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 42,836 మందిని, పట్టణ ప్రాంతాల్లో 15,247 మందిని కలిసి వారి ఆరోగ్య వివరాలను సేకరించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 1209 మందికి గ్రామీణ ప్రాంతాల్లో, 200 మందికి పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ కిట్లను పంపిణీ చేశారు. 24 మందికి కొవిడ్ ఓపీ ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. ఓపీలో ఉన్న మరో 571కొవిడ్ బారిన పడిన వారికి సైతం కిట్లు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జోగుళాంబ గద్వాలలో..
జిల్లాలో మొత్తం 16 పీహెచ్సీలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల పరిధిలో సర్వే చేపడుతున్నారు. గురువారం 484 టీంలు 43,237మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో లక్షణాలు కలిగిన 1,416 మంది ఉండగా హోం ఐసోలేషన్లో ఉన్న వారికి 764కిట్లు అందజేశారు.
వనపర్తి జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా 156మంది వైద్య సిబ్బంది, 586మంది ఆశా కార్యకర్తలు , వీరితో పాటు ఆయా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, వీఆర్వో, అంగన్వాడీ కార్యకర్తలు సర్వే నిర్వహిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ..
జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని 250 ఇండ్లకు ఒక టీం పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.
మూడు రోజుల పాటు సర్వే..
కొవిడ్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారు. సర్వేలో అంగన్వాడీ, ఆశ, పంచాయతీ కార్యదర్శులను పాల్గొనాలని, ప్రతి మండలంలో 3, 4 సూపన్ వైజర్ బృందాలు ఏర్పాటు చేశాం. సర్వేలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే కిట్ ఇస్తారు.