కరోనా వ్యాపిస్తున్న వేగం అంతాఇంతాకాదు. ఒకరికి వైరస్ సోకింది అని తెలిసేలోపే మరో పదిమందిని ఆవహిస్తున్నది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలంటే దానికంటే వేగంగా, ఆఘమేఘాలపై చర్యలు తీసుకోవాలి, వ్యాప్తిని అరికట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సినే ప్రధాన ఆయుధం. ఆ ఆయధాన్ని వాడి కరోనాను ఖతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం తరహా కార్యాచరణకు సిద్ధమవుతున్నది. కేవలం 30 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తున్నది. అందుకోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలి.. ఇదే ప్రధానలక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమానికి సిద్ధమవుతున్నది. దేశంలోనే తొలిసారి భారీస్థాయి వ్యాక్సినేషన్ డ్రైవ్కు సన్నాహాలు చేస్తున్నది. 30 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చే సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నది. 18 ఏండ్లు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసే వ్యూహంపై అధికారులు దృష్టిసారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, హెల్త్ డైరెక్టర్ తదితరులతో కూడిన బృందం దీనిపై చర్యలు జరుపుతున్నది.
వ్యాక్సిన్కు సంబంధించి ముసాయిదా సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అత్యున్నత సమావేశం కూడా జరగనున్నది. సమావేశంలో తుది ప్రణాళికను ప్రకటిస్తారు. ముందుగా.. 4 కోట్ల డోసులను ఆర్డర్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటిని నెలలోపే అందరికీ అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఒక డోసు వేయడానికి 30 రోజుల్లో పూర్తిచేయగలిగితే రెండో డోసుకు మరో 30 రోజులు పడుతుంది. ఇలా మొత్తంగా రెండు నెలల్లోపే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని చూస్తున్నారు. రోజుకు 6,66,667 మందికి వ్యాక్సిన్ ఇస్తేనే అనుకున్న లక్ష్యం పూర్తవుతుంది. దీని కోసం 5వేల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వరంగంలోనే పదివేల మంది అవసరం అవుతారని అధికారుల అంచనా. ప్రతీ వ్యాక్సినేటర్ ప్రతిరోజు సుమారు 150 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ను నిల్వచేయడానికి సుమారు 1000 కోల్డ్ చైన్ పాయింట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
సమగ్ర ప్రణాళిక
ప్రస్తుతం రాష్ట్రంలో 1,468 వ్యాక్సిన్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా మరో 4వేల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొన్నింటిని తాత్కాలికంగా, కొన్నింటిని శాశ్వతంగా వ్యాక్సిన్ కేంద్రాలుగా మార్చనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేవారికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోను వ్యాక్సిన్ వేయడానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాక్సిన్ బల్క్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మొదలు ఏ రోజు ఏ సెంటర్లో ఎంత మందికి టీకా వేశారన్న వివరాలు కూడా రూపొందిస్తారు. రోజువారీగా జిల్లాస్థాయి అధికారులు వ్యాక్సిన్ వేయడంపైనే దృష్టిసారిస్తారు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నా.. ప్రైవేటు దవాఖానల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకొనేవారికి వెసులుబాటు ఇవ్వనున్నారు. అలాగే, ప్రైవేటు సంస్థలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, గ్రామాలు ఎవరైనా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరితే వారు కోరుకున్నచోట వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రత్యేకంగా యాప్ కూడా..
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, టీకా వేసుకొనే లబ్ధిదారులకు ఉపయోగపడేలా ఒక మొబైల్ యాప్ను సిద్ధం చేసే పనిలో అధికారులున్నారు. వీలైనంత త్వరగా యాప్ను రూపొందించాలని భావిస్తున్నారు.
మూడు రకాల వ్యాక్సిన్లు!
ఇప్పటికైతే రాష్ట్రంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఇటీవలే స్పుత్నిక్-వీ టీకాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూడు రకాల టీకాలను తయారుచేసిన కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపనున్నది. వీటితోపాటు ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర వ్యాక్సిన్లను కూడా కేంద్రం అనుమతించి, అవి మన దేశ మార్కెట్లో విడుదలకు సిద్ధం గా ఉంటే వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నది. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ తదితరులు ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది.
ఆషామాషీ కాదు
రాష్ట్రంలో 1,72,41,110 మంది 18-44 ఏండ్ల వయస్కులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ వ్యాక్సిన్ వేయడం పెద్ద సవాలు. వీరేకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న వలస కూలీలు, ఉద్యోగులకు కూడా ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వీరి లెక్కలను కూడా తేల్చే పనిలో అధికారులున్నారు. వీళ్లంతా 50 లక్షల మంది ఉండొచ్చని అంచనా. ఇలా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక కార్యాచరణకు కసరత్తు చేస్తున్నారు.
10శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి
రాష్ట్రంలో టీకాలు తీసుకున్నవారి సంఖ్య 40 లక్షలు దాటింది. దాదాపు 10 శాతం మంది జనాభా కనీసం మొదటి డోస్ తీసుకున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2,00,800 మందికి టీకాలు వేశారు. ఇందులో మొదటిడోస్ తీసుకున్నవారు 1.75 లక్షలు కాగా, 25,082 మందికి రెండోడోస్ వేశారు. టీకా కొరతతో మూడ్రోజుల పాటు వ్యాక్సినేషన్ ఆగినా, కేంద్రం నుంచి రాష్ర్టానికి సరైన సహకారం లేకపోయినా వ్యాక్సినేషన్లో తెలంగాణ టాప్5లో ఉన్నది.
శనివారం నాటికి టీకాలు తీసుకున్నవారు:
మొదటి డోస్ – 35,14,673
రెండో డోస్ – 4,91,678
మొత్తం – 40,06,351