శ్రీశైలం : శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు. శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. క్షేత్రపాలకుడిగా దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన చేశారు.
అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు, ఫలాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో దేవతామూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధింపజేసి పంచసూక్తం, వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా పెట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.