అహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో సమష్టి ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. ఢిల్లీపై సూపర్ విక్టరీతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
రిషబ్ పంత్(58 నాటౌట్: 48 బంతుల్లో 6ఫోర్లు), హెట్మైర్(53 నాటౌట్: 25 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు వృథా అయ్యాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా క్రీజులో పంత్, హెట్మైర్ ఉన్నారు. కెప్టెన్ కోహ్లీ బంతిని సిరాజ్కు ఇచ్చాడు. తొలి నాలుగు బంతుల్లో బౌండరీలు బాదడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. చివరి రెండు బంతులను పంత్ ఫోర్లు బాదినా ఢిల్లీ లక్ష్యానికి ఒక్క అడుగుదూరంలో నిలిచిపోయారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(12), దేవదత్ పడిక్కల్(17) క్లీన్బౌల్డ్ అయ్యారు. మాక్స్వెల్(25: 20 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు), రజత్ పటిదార్(31: 22 బంతుల్లో 2సిక్సర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబాడ, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్పటేల్ తలో వికెట్ తీశారు.