న్యూఢిల్లీ: బ్యాంకింగ్ లావాదేవీలంటే ప్రస్తుతం డెబిట్ కార్డు.. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు వాడుతుంటాం.. క్రమంగా డిజిటల్ చెల్లింపులు పుంజుకుంటున్నా.. డెబిట్/ క్రెడిట్ కార్డుల వాడకం తగ్గలేదు. గతంలో డెబిట్ కార్డు మిస్సయినా.. చోరీ అయినా.. వెంటనే బ్యాంకులో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. వెంటనే కార్డు వచ్చేస్తుంది.
సాధారణంగా రెండు, మూడు రోజుల్లోనే డెబిట్ కార్డు రావచ్చు. కొన్ని బ్యాంకులు ఖాతా తెరిచిన రోజే ఖాతాదారులకు డెబిట్ కార్డు జారీ చేస్తాయి. కానీ, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం అన్ని తనిఖీలు పూర్తయ్యాక సంత్రుప్తి చెందితనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి.
కానీ ఇప్పటికిప్పుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పోగొట్టుకున్నారనుకోండి.. దాన్ని వెంటనే బ్లాక్ చేయొచ్చు. కానీ రెండు, మూడు రోజుల్లోనే పొందడం తేలిక కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో చిప్ల కొరత నెలకొంది. కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 300 కోట్ల మేరకు డెబిట్, క్రెడిట్ కార్డులు తయారవుతున్నాయి. అయితే, సుమారు 90 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లోనూ 40-60 శాతం డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల మద్దతు కావాలి.
కరోనా మహమ్మారితో గతేడాది మిగతా పరిశ్రమల మాదిరిగానే చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసేశారు. వర్క్ ఫ్రం లేదా లెర్న్ ఫ్రం హోం పెరిగిపోయింది.
దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్లకు డిమాండ్ పెరిగింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్గా డిమాండ్ ఎక్కువైంది.
చిప్స్ కొరత ఏర్పడడంతో సెమీకండక్టర్ పరిశ్రమ దెబ్బతిన్నది. పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటి కొరత వల్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల తయారీ భారం కానున్నది. ఈ పరిస్థితి వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని మొబైల్ పేమెంట్స్ సంస్థలు తెలిపాయి.