ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ రోజరోజుకు కొత్త రూపాలతో ప్రమాదకరంగా విజృంభిస్తున్నదని హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు. యూకే వేరియంట్తోపాటు మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపుతున్న డబుల్ మ్యుటేటెడ్ వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని దేశవ్యాప్తంగా తాము సేకరించిన నమూనాల ద్వారా వెల్లడైందని ఆయన నమస్తే తెలంగాణకు సోమవారం చెప్పారు. కొత్త ఉత్పరివర్తనాల వ్యాప్తి ఎలా ఉన్నదన్న విషయంలో ఇంతవరకు పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదని వెల్లడించారు. తాము హైదరాబాద్తో పాటు ఇతర విమానాశ్రయాల్లో సేకరించిన నమూనాల్లో మాత్రమే యూకే వేరియంట్ కనిపించిందని, ఇప్పుడు అది చాలాచోట్ల వ్యాపించినట్టు తమవద్ద నివేదికలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర కేంద్రంగా విస్తరిస్తున్న డబుల్ మ్యుటేటెడ్ వైరస్ ప్రభావం కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో ఎంతవరకు ఇది ప్రభావం చూపుతుందనేదానిపై దృష్టి సారించామన్నారు. మ్యుటేటెడ్ వైరస్లు మొదటిదశ వైరస్ కంటే రెండుమూడు రెట్లు వేగంగా విస్తరిస్తున్నదని చెప్పారు.
మనుషులు ముఖాముఖి మాటలు తక్కువచేసి అక్షరాల రూపంలో, ఇతర మాధ్యమాల ద్వారా సందేశాలు, సమాచారాన్ని చేరవేసుకోవడం మంచిదని రాకేశ్మిశ్రా సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని మాత్రమే మాట్లాడాలని అన్నారు. వీలైనంత వరకూ నోటి మాటల ద్వారా కాకుండా సెల్ఫోన్లో సంక్షిప్త సందేశాలు లేదా ఈ మెయిల్ వంటివాటి ద్వారా సమాచారాన్ని చేరవేసుకోవాలని సూచించారు. మనిషికి మనిషికి మధ్య దూరం మూడు నుంచి ఆరడుగులు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలన్నారు. వైరస్ ఆరడుగుల వరకు వ్యాపించే అవకాశమున్నందున ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వెంటిలేషన్ లేకుండా తలుపులు మూసి ఉన్న గదుల్లో కరోనా అధికంగా విస్తరించే ప్రమాదమున్నందున సాధ్యమైనంత వరకు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలన్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి చాలామంది అజాగ్రత్తే ప్రధాన కారణమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం తప్పదని హెచ్చరించారు.