వాషింగ్టన్, ఏప్రిల్ 22: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో చరిత్రను సృష్టించింది. అంగారకుడి మీద తొలిసారిగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేసింది. నాసాకు చెందిన పర్సెవరెన్స్ రోవర్లోని ఓ పరికరం.. మార్స్ వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ను విజయవంతంగా వేరు చేసింది. ఈ మేరకు నాసా బుధవారం ప్రకటించింది. పర్సెవరెన్స్ రోవర్ మీద అమర్చిన టోస్టర్ సైజు ఉన్న మోక్సీ (మార్స్ ఆక్సిజన్ ఇన్-సితు రీసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్పరమెంట్) అనే డివైజ్.. 5 గ్రాముల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసిందని నాసా పేర్కొంది. ఇది ఒక వ్యోమగామి 10 నిమిషాల పాటు శ్వాస తీసుకోవటానికి సరిపోతుందని వెల్లడించింది. ఈ ఆక్సిజన్ ఎంతో స్వచ్చమైనదని, మనుషులు నేరుగా పీల్చుకోవచ్చని వివరించింది.
ఇతర గ్రహంపై ఉన్న వనరులతో మానవులు నేరుగా ఉపయోగించుకునే స్వచ్చమైన గాలిని తయారుచేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ప్రాథమికంగా తక్కువ మోతాదులో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసినప్పటికీ, భవిష్యత్తులో ఎక్కువ స్థాయిలో ప్రాణవాయువును తయారు చేస్తామని పేర్కొంది. ‘వేరే గ్రహంపై ఆక్సిజన్ను ఉత్పత్తి చేసిన మొట్టమొదటి పరికరంగా మోక్సీ నిలవడమే కాదు.. మనుషులు ఇతర గ్రహాలపై నివసించేందుకు అవసరమైన సాంకేతికతను తీసుకొచ్చిన తొలి పరికరంగా ‘మోక్సీ’ నిలిచింది’ అని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టర్ ట్రుడీ కోర్టస్ అన్నారు. కాగా, అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి ఫిబ్రవరి 18న పర్సెవరెన్స్ రోవర్ మార్స్పై దిగడం తెలిసిందే. రెండురోజుల క్రితమే రోవర్పై ఉన్న ఇన్జెన్యుయిటీ హెలికాప్టర్ అరుణగ్రహంపై ఎగిరి చరిత్ర సృష్టించడం కూడా తెలిసిందే.
భవిష్యత్తు యాత్రలకు మార్గదర్శకం
అంగారక గ్రహంపై మానవసహిత యాత్రలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. నలుగురు వ్యోమగాములు మార్స్పైకి వెళ్లడానికి 7 మెట్రిక్ టన్నుల రాకెట్ ఇంధనంతోపాటు 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం. అయితే, మార్స్పై ‘మోక్సీ’ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగలగడం వల్ల భవిష్యత్తులో ఈ ఆర్థిక ప్రయాసలు ఉండబోవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ‘మోక్సీ’లాంటి పరికరాల సాయంతో మార్స్పైనే వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడంతో పాటు, అదే ఆక్సిజన్తో రాకెట్ ఇంధనాన్ని కూడా తయారు చేసుకోవచ్చని అంటున్నారు. ‘భూమి నుంచి 25 టన్నుల ఆక్సిజన్ను మార్స్పైకి తీసుకెళ్లడానికి బదులుగా.. ఒక టన్ను ఆక్సిజన్ కన్వర్షన్ మెషిన్ను (మోక్సీలాంటిది) తీసుకెళ్లడం ఎంతో ప్రయోజనకరం’ అని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మోక్సీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైఖెల్ హెచ్ట్ తెలిపారు. ఒక్క మెట్రిక్ టన్ను ఆక్సిజన్తో మార్స్పై ఏడాదిపాటు ఒక వ్యోమగామి ఉండవచ్చని ఆయన తెలిపారు.
ప్రాణవాయువు తయారీ ఇలా..
అంగారకుడిపై అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అక్కడి వాతావరణంలో 95 శాతం కార్బన్డైఆక్సైడ్ ఉండగా, మిగిలిన 5 శాతంలో నైట్రోజన్, ఆర్గాన్ తదితర వాయువులు నిండిఉన్నాయి. అత్యంత స్వల్ప పరిమాణంలో మాత్రమే ఆక్సిజన్ ఉన్నది. ‘ఎలక్ట్రాలిసిస్’ ప్రక్రియను ఉపయోగించి అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలను కల్పించి.. కార్బన్డైఆక్సైడ్ (సీవో2) అణువులను ‘మోక్సీ’ విజయవంతంగా విడగొట్టింది. తద్వారా ఆక్సిజన్ను (వో2) ఉత్పత్తి చేసింది. ప్రాథమికంగా గంటకు 10 గ్రాముల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేలా మోక్సీని డిజైన్ చేశారు. రానున్న రెండేండ్లలో మార్స్పై ఉన్న వాతావరణ పరిస్థితుల మధ్య మరో 9సార్లు ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనున్నది.
ఇవీ కూడా చదవండి…
మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా