పర్వతగిరి, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు లేక బస్టాండ్లో వేచి ఉన్న గర్భిణిని తన వాహనంలో ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటారు మామూనూర్ ఏసీపీ నరేశ్కుమార్. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తురుకల సోమారం గ్రామానికి చెందిన బరిగెల స్వర్ణ హైదరాబాద్లో ఉంటున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సోమవారం తన స్వగ్రామానికి బయల్దేరి మండల కేంద్రానికి వచ్చింది. గర్భిణిగా ఉన్న ఆమె సోమారం గ్రామానికి వెళ్లేందుకు యత్నించగా బస్సులు ఆటోలు లేకపోవడంతో బస్టాండ్లో ఉన్న ఆమెను గమనించిన ఏసీపీ నరేశ్కుమార్ వివరాలు తెలుసుకున్నారు. మానవత్వంతో స్పందించి పోలీసు వాహనంలో ఆమెను వారి ఇంటికి పంపించారు. మానవత్వం చాటిన పోలీసులకు స్వర్ణ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఐ కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.