అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్రానికి తరలించారు. ఇంతకు ముందు సైతం ఈ వేద పాఠశాలలో భారీగానే కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వేద పాఠశాలలో ఒకేసారి 50 మంది విద్యార్థులకు వైరస్ బారినపడడంతో స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతుండడతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వైరస్ పాజిటివ్గా తేలింది. అయితే, విద్యార్థులకు ఎలా కరోనా సోకిందో తెలియడం లేదు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్గా తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచారు.