న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు.. గతేడాది అనుభవాలతో ముందుజాగ్రత్త పడుతున్నారు. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ తదితర పలు రాష్ర్టాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
మళ్లీ ఇబ్బందులు పడొద్దని..
గతేడాది లాక్డౌన్ నేర్పిన పాఠాలను గుర్తుచేసుకుంటున్న వలస కార్మికులు.. కఠిన ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఇప్పటికే పలువురు వలస కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. మహారాష్ట్రలోని పుణెలో పనిచేస్తున్న దాదాపు సగం మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు పుణె హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేశ్ షెట్టి తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లోని గ్రామాల నుంచి గుజరాత్లోని సూరత్, అహ్మదాబాద్ నగరాలకు పనుల కోసం వలస వచ్చిన కార్మికులు కూడా తిరిగి ప్రయాణమవుతున్నట్టు జోనల్ రైల్వే అధికారి యోగేశ్ మిశ్రా తెలిపారు.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. లాక్డౌన్ విధించాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి సలహా ఇచ్చిందని.. దీంతో లాక్డౌన్ విధిస్తారేమోనన్న భయాలతో కూలీలు సొంతూళ్లకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అహ్మదాబాద్లో పనిచేస్తున్న 70 శాతం మంది కూలీలు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నట్టు వలస కార్మికుల కోసం పని చేస్తున్న ఆజీవికా అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా విధించిన లాక్డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూళ్లకు వెళ్లడానికి తిండి, డబ్బు, రవాణా సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అలాంటి కష్టాలు పడొద్దనే ముందస్తుగా వెళ్తున్నట్టు ఢిల్లీలో పనిచేస్తున్న బీహార్ వాసి పింటూ తెలిపాడు.
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులతో ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్, అహ్మదాబాద్లోని కలుపూర్ రైల్వే స్టేషన్, ముంబై, సూరత్లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. యూపీ, బీహార్కు వెళ్లే అన్ని రైళ్లు కొన్ని వారాలపాటు ఖాళీగాలేవని అధికారులు తెలిపారు. వలసకూలీల కోసం మూడు ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నట్టు సెంట్రల్ రైల్వే బుధవారం ప్రకటించింది. ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్ల సంఖ్యను కూడా పెంచబోతున్నట్టు వెల్లడించింది.
గతేడాది బాధాకర స్మృతులు
గతేడాది కేంద్రప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్డౌన్ విధించటంతో వలస కూలీలు దారుణమైన బాధలను ఎదుర్కొన్నారు. పని చేసే చోట పనులు నిలిచిపోవటంతో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు అయిపోతుండటం, సొంతూళ్లకు వెళ్దామంటే బస్సులు, రైళ్లు నిలిచిపోవటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షలాదిమంది కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. మార్గమధ్యలోనే వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ కూడా చదవండీ…