ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులెవ్వరూ భయాందోళనకు గురికాకుండా ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి బస్సును శానిటైజ్ చేస్తున్నారు. అందుకోసం డిపోల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి బస్సులో హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశామని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బస్సుల్లో ప్రయాణించే వారికి కొవిడ్ నిబంధనలు గురించి తెలియజేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారంతా ముఖ్యంగా సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వారంతా మాస్కులు ధరించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 29 డిపోల నుంచి దాదాపు 1,150 రూట్లలో బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల ట్రిప్పులను నిర్ణయిస్తున్నారు. అయినప్పటికీ అన్ని రూట్లలో తిరుగుతున్న బస్సుల్లో కొవిడ్ నిబంధనలు చాలా కఠినంగా పాటిస్తున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.