చెన్నై: తమిళనాడులో ఓటింగ్కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రలోభాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు రాష్ట్ర మంత్రి సీ విజయభాస్కర్ ప్రధాన అనుచరుడు మురగేషన్ ఇళ్లపై దాడిచేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ.2.5 లక్షలకుపైగా నగదు లభించింది. సుమారు ఆరు గంటలపాటు ఆ ఇంట్లో తనిఖీలు చేశారు. ఇదే సమయంలో వీరలిమలై ప్రాంతంలో అతనికి సంబంధించిన మూడు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ రూ.1.44 లక్షలు లభించాయి. అదేవిధంగా ఆప్రాంతంలో డబ్బులు పంచుతున్న ముగ్గురిని అధికారులు అరెస్టు చేశారు.
తమిళనాడులో ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. ఒకే విడుతలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల కోసం మొత్తం 1,55,102 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 80 ఏండ్లు పైబడినవారికి పోస్టల్ ఓట్లు వేసేలా అవకాశం కల్పించారు. దీనికోసం 2.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడుతాయి.
ఎన్నికల బరిలో అన్నాడీఎంకే, డీఎంకే, కమల్హాసన్, దినకరన్ పార్టీలతోపాటు పలు రాజకీయ పక్షాలు పోటీలో ఉన్నాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నది.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం గడువు మే 24తో ముగినయుంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ తదితర పక్షాలు ఉండగా, డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు చెరో 25 స్థానాల్లో పోటీచేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..