పల్లె ప్రగతితో మారిన పంచాయతీ రూపురేఖలు
సకాలంలో డంప్ యార్డ్, వైకుంఠధామం పూర్తి
ఆకట్టుకునేలా పల్లె ప్రకృతి వనం
ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు
కోటపల్లి, ఏప్రిల్ 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పల్లె ప్రగతి’తో మల్లంపేట ప్రగతి బాట పడుతున్నది. సర్పంచ్ అక్కల మధూకర్, ఉప సర్పంచ్ అకుదారి లచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి సాగర్తో పాటు పాలకవర్గం సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. మల్లంపేట గ్రామపంచాయతీలో 1056 జనాభా, 303 నివాస గృహాలు ఉన్నాయి. రూ.12.5 లక్షలతో వైకుంఠధామం, రూ. 2.5 లక్షలతో డంప్ యార్డు, రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా 400 మొక్కలు నాటడంతో పాటు పల్లె ప్రకృతి వనంలో 3000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను రక్షించేందుకు కోసం ప్రత్యేకంగా డ్రిప్ను ఏర్పాటు చేసి మొక్కలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీటిని అందిస్తున్నారు. వీధుల్లోని 75 స్తంభాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చారు. పారిశుధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మొక్కలకు ప్రతిరోజూ నీటిని పట్టేందుకు రూ.6.67 లక్షలు వెచ్చించి ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. ప్రతి రోజూ ముగ్గురు కార్మికులు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ప్రధాన రోడ్డుతో పాటు వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. గ్రామపంచాయతీలో 80 శాతానికి పైగా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికాగా, మిగతా పనులను త్వరలో పూర్తి చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. యేటా 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. 100 శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఇవి కూడా చూడండి..
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!