చండీగఢ్: వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూసే బాధ్యత మనందరిదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని జిండ్లో ఆదివారం జరిగిన కిసాన్ మహా పంచాయతీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిరసన సమయంలో 300 మంది రైతులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో నిరసన చేస్తున్న వేలాది మంది రైతులను 9 స్టేడియాల్లో నిర్బంధించి వాటిని జైళ్లుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. అయితే అదృష్టవశాత్తు దానిని అడ్డుకునే అధికారం సీఎంగా తనకు ఉండటంతో అది సాధ్యం కాలేదన్నారు.
శాంతి భద్రతల సమస్య ఉందంటూ కేంద్రం తనకు ఒక ఫైల్ పంపిందని, దానిని ఆమోదించకపోతే తన అధికారాన్ని తొలగిస్తామని కూడా హెచ్చరించిందని కేజ్రీవాల్ తెలిపారు. అయినప్పటికీ తాను బీజేపీ హెచ్చరికలను లెక్కచేయలేదని, ఆ ఫైల్ను తిప్పి పంపానని వివరించారు.
అందుకే రైతులకు మద్దతిచ్చిన కేజ్రీవాల్ను శిక్షించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిందని మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వానికి కాకుండా లెఫ్ట్నెంట్ గవర్నర్కు అధికారాలు దక్కేలా చేశారని కేజ్రీవాల్ విమర్శించారు. దీని కోసమే మనం స్వాతంత్ర్యం కోసం పోరాడామా అని ప్రశ్నించారు.