ఉమ్మడి జిల్లాలోని అన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరా
కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
ఇక మరింత బలోపేతం దిశగా అడుగులు
ఇప్పటికే పలు పాఠశాలలకు కొత్త భవనాలు
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చి, సకల సౌకర్యాలు కల్పించి, వాటి రూపు రేఖలు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం విరివిగా నిధులు విడుదల చేస్తుండగా, దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. కాగా, ఉమ్మడి జిల్లాలోని స్కూళ్ల స్థితిగతులపై ఇప్పటికే 53 అంశాలతో కూడిన నివేదికను అధికార యంత్రాంగం నుంచి ఆన్లైన్లో సేకరించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదల కానుండగా, త్వరలోనే బడులకు కొత్త శోభ రానున్నది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటుండగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమతువున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఈఏడాది బడ్జెట్లో రూ.4000 కోట్ల నిధులను కేటాయించింది. ఈనిధులను సకాలంలో ఖర్చు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. అవసరమైన చోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులను నిర్మించాలని భావిస్తున్నది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వలస వస్తుండడంతో, తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. రానున్న విద్యాసంవత్సరానికి ముందుగానే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం పాఠశాలల్లోని 53 అంశాలతో కూడిన జాబితాను ఆన్లైన్లో నమోదు చేశారు. త్వరలో పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించనుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరింత బలోపేతం దిశగా..
ఇప్పటికే ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వం ఆధునికంగా తీర్చిదిద్దింది. మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నది. పలు పాఠశాలల భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ గదుల్లోనే విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఇలాంటి పాఠశాలలను గుర్తించి, వీటి స్థానంలో కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతుండడంతో ఈ తరగతి గదుల నిర్మాణం అనివార్యమైంది.
వివరాల సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్లలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల వివరాలను ఎంఈవోలు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయుల నుంచి ఇప్పటికే సేకరించారు. ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 53 అంశాలతో కూడిన వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో పాఠశాల విద్యార్థుల సంఖ్య, తరగతులు, కమ్యూనిటీల వారీగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు, పాఠశాలలో ఎన్ని తరగతి గదులు ఉన్నాయి, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి, శిథిలావస్థలో ఎన్ని ఉన్నాయి, అదనపు తరగతి గదులు అవసరం ఉన్నాయా, ఉంటే తరగతి గదులను నిర్మించేందుకు ఎంత స్థలం అందుబాటులో ఉంది. ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి, ఇంకా ఎంత అవసరం ఉన్నాయి. డెస్కులు, సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్లు, విద్యుత్ సరఫరా, బ్లాక్ బోర్డులు, తాగు నీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, ప్రొజెక్టర్, ఆటస్థలం, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు తదితర వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 756 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 533 ప్రాథమిక పాఠశాలలు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 117 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, 1 టీఎస్ఆర్ఈ ఐఎస్, 1 మోడల్ స్కూల్, 1 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కలిపి పాఠశాలలో మొత్తం 53,751 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. కాగా, ఇప్పటికే పలు చోట్ల కొత్త భవనాలను నిర్మించింది. మరికొన్ని చోట్ల ఉన్న భవనాలకు మెరుగులు దిద్దుతున్నది. దీంతో ఆయా స్కూళ్లు కొత్త రూపు దిద్దుకుంటున్నాయి.
ఇక సమస్యలు దూరం
జిల్లాలోని 756 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సూచించిన 53 అంశాల నివేదికలను ఇప్పటికే అందించాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆన్లైన్లో పంపించాం. త్వరలోనే ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలు దూరం కానున్నాయి.
ఇవి కూడా చుడండి
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
అల్లం టీతో ఆస్తమాకు గుడ్బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
50 రోజులు.. 4 వేల కి.మీ. గిన్నిస్ రికార్డే ఈ సైనికుడి లక్ష్యం
లాక్డౌన్పై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు