ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఐడీ కార్డులు తెచ్చుకోవాలి
సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సీపీ విష్ణు
ఖమ్మం, మే 12: లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. లాక్డౌన్ అమలు నేపథ్యంలో బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. లాక్డౌన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పది రోజుల పాటు ప్రజల అవసరాల కోసం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకూ ప్రభుత్వం సడలింపునిచ్చిందని అన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ఆ సడలింపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని విషయాల్లోనూ ఉదయం 10 గంటల తరువాత కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు తమ అక్రిడిటేషన్లు గానీ, ఐడీ కార్డులుగానీ వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులు చూపించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజూస్టర్ మేనేజ్మెంట్ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసులు
అత్యవసర పరిస్థితుల్లో వేరే రాష్ర్టాలకు, ఇతర జిల్లాలకు ప్రయాణం చేసే వారికి ఈ-పాస్ విధానం ద్వారా పాసులను జారీ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. పాస్ల కోసం https ://policeportal.tspolice.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.