హోవ్: యువ సంచలనం షఫాలీ వర్మ (38 బంతుల్లో 48; 8ఫోర్లు, ఓ సిక్స్) బ్యాటింగ్లో దుమ్మురేపితే.. చివర్లో స్పిన్నర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టడంతో రెండో టీ20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో హర్మన్సేన 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లిష్ జట్టును చిత్తుచేసి మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఓపెనర్ షఫాలీ మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31) స్మృతి మంధాన (20) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఓపెనర్ టామీ బ్యూమౌంట్ (59) విజృంభించడంతో ఓ దశలో 13.4 ఓవర్లకే 106 పరుగులు చేసిన ఇంగ్లండ్ను భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్ (2/17), దీప్తిశర్మ (1/18), స్నేహ్ రాణా (0/21) అద్భుతంగా కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో 33 పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది.