ఆక్సిజన్ అందక 11 మంది మృతి
హుటాహుటిన ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ
తిరుపతి, మే 10 (నమస్తే తెలంగాణ): తిరుపతి రుయా దవాఖానలో సకాలంలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల 11 మంది కరోనా రోగులు మృతిచెందారని చిత్తూరు కలెక్టర్ ప్రకటించారు. శ్రీపెరంబదూర్ నుంచి దవాఖానకు చేరుకోవాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు. దవాఖాన వైద్యులు, సిబ్బంది హుటాహుటిన ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారని.. దీంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఆక్సిజన్ అందకపోవడంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి ఆయ్యారు. దీంతో శ్వాస అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నంచేశారు. వైద్యులతోపాటు రోగుల బంధువులు ఎంతగా ప్రయత్నించినా పరిస్థితి తీవ్రంగా ఉన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. రుయా ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.