మహబూబ్నగర్, ఏప్రిల్20: కరోనా కట్టడికి రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వెబ్ఎక్స్ వీసీ ద్వారా హాజరై ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రజల ఆరోగ్య సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీయాలని సూచించారు.
కరోనా సమయంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెబ్ఎక్స్ ద్వారా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి వెబ్ఎక్స్ ద్వారా ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. సమస్యలను ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ వెబ్ఎక్స్ ద్వారా మాట్లాడారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీలో చొరవ తీసుకోవాలన్నారు.
మరో 100 పడకలు సమకూర్చుతున్నాం
ప్రస్తుతం ఉన్న 150 పడకల కొవిడ్ దవాఖానకు మరో వంద పడకలు అదనంగా సమకూర్చుతున్నామని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మండల, గ్రామ స్థాయిలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని మంత్రికి వివరించారు. అంతకుముందు కలెక్టర్ సంబంధిత అధికారులో కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్నందలాల్ పవర్, సీతారామారావు, డీఆర్వో కె. స్వర్ణలత, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు.