అమరావతి : మరో రెండురోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను టీడీపీ తరుఫున ప్రస్తావించి నిలదీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ పార్లమెంటరీ సభ్యులకు సూచించారు. శనివారం వర్చువల్ విధానంలో ఆయన ఎంపీలతో మాట్లాడారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు అంశాలు, పంచాయతీ నిధుల దారి మళ్లింపు, ఉపాధి నిధుల అంశాలను చర్చకు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, పెట్రో ధరలపై ఏపీలో అధిక పన్నుల ప్రస్తావన, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ సరఫరా అంశాలను చర్చకు తీసుకురావాలని సూచించారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన, వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల సుఫారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ చేపట్టాలని కోరాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు.