అమరావతి : ఒకవైపు భారీ వర్షాలు..మరోవైపు భూ ప్రకంపనలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నాం నుంచి అర్ధరాత్రి వరకు పలుమార్లు భూమి కంపించింది. జిల్లాలోని పలమనేరు, కరడిమడుగు మండలంలో భారీ శబ్దంతో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నాం కూడా రామకుప్పం మండలం, గడ్డూరు తదితర గ్రామాల్లో భూ ప్రకంపనులు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి భూప్రకంపనలు సంభవించిన గ్రామాల్లో పర్యటించి సమాచారాన్ని సేకరించారు.
వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుండటంతోనే ప్రకంపనలు వచ్చి ఉండవచ్చవని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఏ మనోహర్, స్థానిక టీడీపీ నేతలతో కలిసి భూప్రకంపనలు చోటుచేసుకున్న గడ్డూరు, చిన్నగెరిగెపల్లె, పెద్దగెరిగెపల్లె, గోరివిమాకులపల్లెల్లో పర్యటించారు.