15 నియోజకవర్గాల్లో ఏర్పాటుకు సిద్ధం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు
కిరాయి భవనాల కోసం అన్వేషణ
నోటిఫికేషన్ ఇచ్చిన కలెక్టర్
బీసీ విద్యార్థులకు మహర్దశ
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకోశుభవార్త. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 30 గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. బీసీ సామాజిక వర్గాలకు చెందినపేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకోసం సామాజిక వర్గాల వారీగాఅన్ని హంగులతో గురుకులాలను ఏర్పాటు చేస్తున్నది. బాలురకు 15, బాలికలకు 15 చొప్పున ఏర్పాటు చేసే గురుకులాల కోసం అద్దె భవనాలు సేకరించేందుకు కలెక్టర్ శ్వేతామహంతి నోటిఫికేషన్ జారీ చేశారు.
బాలబాలికల కోసం మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో నియోజకవర్గానికో బీసీ గురుకులాన్ని ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ గురుకులాల ఏర్పాటుకు ప్రస్తుతం పక్కా భవనాలు అందుబాటులో లేవు. దీంతో తాత్కాలికంగా అద్దె భవనాల్లో ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన అద్దె భవనాలు సేకరణ కోసం కలెక్టర్ శ్వేతామహంతి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
వీలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచే బీసీ గురుకులాల్లో ప్రవేశాలు నిర్వహించి పాఠాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేట్, సికింద్రాబాద్, సికింద్రాబాద్-కంటోన్మెంట్, ముషీరాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, గోషామహల్, మలక్పేట్, సనత్నగర్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బహదూర్పుర, ఖైరతాబాద్, యాకుత్పుర నియోజకవర్గాల్లో ఈ గురుకులాలను ప్రారంభించనున్నారు. వీటిలో ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున 15 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 30 బీసీ గురుకులాలను ఏర్పాటు కోసం అద్దె భవనాలు కావాలని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.
భవన సముదాయంలో కనీసం నిర్మాణం 60 వేల చదరపు అడుగులతో పాటు 5 వేల చదరపు గజాల ఖాళీ స్థలం ఉండాలి.
భవనంలో 20 తరగతి గదులు, 20 అదనపు గదులు, ఇతర అవసరాలు కోసం స్టాఫ్ రూమ్, ప్రిన్సిపాల్ గది, పరిశోధనాలయం, గ్రంథాలయం వంటి వాటి కోసం మరో పది గదుల అవసరం ఉంటుంది.వసతి గృహాల కోసం 14 గదులు, భోజనశాల కోసం 2 వేల అడుగుల నిడివి కలిగిన పెద్ద గది, వంట కోసం 500 చదరపు అడుగులున్న గది, 30 బాత్రూమ్లు, 30 వాష్రూమ్లు అవసరం.
నెల వారీగా అద్దె భవనాలు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న వారు జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా 8309838150, 9441362748, 9121167317 నంబర్లను సంప్రదించాలని జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బీ. ప్రభాకర్, కన్వీనర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.