పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఉంటుంది. సంప్రదాయ సాగుతో పోలిస్తే రెట్టింపు ఆదాయం. ఈ నేపథ్యంలో ‘పట్టు పురుగుల పెంపకం’ ఎలా చేపట్టాలి? ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ అనే విషయాలపై ప్రత్యేక కథనం.
పట్టు పురుగుల పెంపకం 21 రోజుల ప్రక్రియ. ఈ పంట మొత్తం ఐదు దశల్లో ఉంటుంది. రెండు దశలు చాకీ సెంటర్లలో పూర్తి కాగా, రైతువద్ద మూడు దశలు పూర్తి చేసుకుంటుంది. చాకీ కేంద్రాల్లో పట్టు పురుగుల గుడ్లను పొదిగిన తర్వాత ఎనిమిది రోజులు అక్కడే ఉంచుకొని, తొమ్మిదో రోజున పురుగులను రైతుకు సరఫరా చేస్తారు. అప్పటినుంచి 21వ రోజు వరకూ వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పట్టు పురుగులకు 14 రోజులు ఆకులు వేస్తే పురుగులు పట్టుకాయలు (కకూన్స్)గా మారుతాయి.
పట్టు పురుగుల పెంపకం సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా చేసుకోవచ్చు. కనిష్ఠంగా 10 నెలలపాటు సాగు చేయవచ్చు. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఆ రెండు నెలలూ పట్టు పురుగులను పెంచుకోవచ్చు. ఇలా, ఏటా కనీసం ఏడునుంచి పది పంటలు తీసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లోని మరే వ్యాపారానికీ ఈ వెసులుబాటు ఉండదు. అదే విధంగా, పట్టు పురుగులకు కావాల్సిన మల్బరీ ఆకుకూడా ఏడాదంతా లభిస్తుంది. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే సుమారు 15 ఏండ్లపాటు పంటను ఇస్తూనే ఉంటాయి. దీంతో ప్రతిసారీ కొత్తగా మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉండదు.
పట్టు పురుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో, ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంట. అయితే, ఇందులోకి దిగాలనుకునేవారు తొలి పెట్టుబడి కాస్త ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకానికి కావాల్సిన షెడ్డు నిర్మాణానికే అధికభాగం వెచ్చించాల్సి వస్తుంది. 1250 చదరపు అడుగుల్లో షెడ్డు నిర్మాణానికి రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుంది. దీనికితోడు మల్బరీ తోటసాగు, డ్రిప్ సిస్టమ్, గుడ్లు, ట్రేల కొనుగోలు కోసం మరో రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే, తొలి ఏడాది కనీసంగా రూ. 7 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక, మరుసటి ఏడాదినుంచి కేవలం రూ. 20 వేల పెట్టుబడి మాత్రమే అవసరమవుతుంది.
పట్టు పురుగుల పెంపకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ సబ్సిడీలను అందిస్తున్నాయి. 1250 చ.అ. షెడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు సబ్సిడీ ఇస్తున్నది. ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్ ఖర్చుకింద మరో రూ.1.35 లక్షల వరకూ అందిస్తున్నది. ఎస్సీ రైతులకు ప్రత్యేకంగా మరో రూ. లక్ష వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో డ్రిప్ను అందిస్తుంది. రైతు పెట్టిన ఖర్చులో సగం వరకూ సబ్సిడీల రూపంలోనే తిరిగి వస్తుంది. పట్టుగూళ్లకు మద్దతు ధర లేకపోవడంతో మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రభుత్వమే అదనంగా ప్రోత్సాహకం అందిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి కిలో కకూన్స్కు అదనంగా రూ.75 ఇస్తున్నది. కర్ణాటక రూ. 25, తమిళనాడు రూ.40, మహారాష్ట్ర రూ. 50, ఏపీ రూ.50 మాత్రమే అందిస్తున్నాయి.
ఇతర పంటలతో పోలిస్తే పట్టు పురుగుల సాగులో అధిక ఆదాయం సమకూరుతున్నది. 100 గుడ్లతో (ఒక గుడ్డుకు 500 పురుగులు) సరాసరి 70 కేజీల పట్టు ఉత్పత్తి అవుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 90నుంచి 100 కేజీలదాకా ఉత్పత్తి చేయవచ్చు (మన రాష్ట్రంలో కొంతమంది రైతులు 100 కేజీలు కూడా ఉత్పత్తి చేస్తున్నారు). ఒక ఎకరం మల్బరీ ఆకు సాగుతో 250 డీఎల్ఎఫ్లు (1.25 లక్షల పురుగులు) పెంచవచ్చు. దీనిద్వారా 180 కేజీల పట్టును ఉత్పత్తి చేయవచ్చు. ఒక కేజీ పట్టుగూళ్ల ఉత్పత్తికి రూ. 220 నుంచి రూ.240 దాకా ఖర్చవుతుంది. అంటే, 180 కేజీల పట్టుగూళ్ల ఉత్పత్తికి సుమారు రూ.40వేల వరకు ఖర్చవుతుంది. మార్కెట్లో రెండు నెలల క్రితం కేజీ పట్టుగూళ్ల ధర రికార్డు స్థాయిలో రూ.450 వరకూ పలికింది. అంటే, 180 కేజీల పట్టుకు రూ.80 వేల దాకా ఆదాయం వస్తుంది. ఇందులో రూ.40 వేల ఖర్చులు తీసేస్తే, రైతుకు నికరంగా రూ.40వేల ఆదాయం మిగులుతుంది. ఈ విధంగా ఏడాదిలో కనీసంగా ఎనిమిది పంటలు సాగు చేసినా, రూ.3 లక్షల దాకా ఆదాయం సమకూరుతుంది. ఏవైనా కారణాలవల్ల రేటు పడిపోయినా, కనీస ఆదాయం రూ.లక్షకు తగ్గకుండా ఉంటుంది. అయితే, ఈ పంట సాగులో 2.5 ఎకరాలకు ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఎందుకంటే, మల్బరీ తోట పెట్టిన తర్వాత ఆకు దశకు రావడానికి ఐదునుంచి ఆరునెలల సమయం పడుతుంది. ఒక క్రాప్ పూర్తయితే, మళ్లీ ఆకు రావడానికి మూడు నెలల సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఎకరంలో ఒకసారి, మరో ఎకరంలో మరోసారి తోట పెంచితే ఒక క్రాప్ పూర్తయ్యేసరికి మరో క్రాప్ సిద్ధంగా ఉంటుంది. దీంతో పట్టు పురుగుల సాగుకు ఎలాంటి అవాంతరం ఉండదు. ఏడాదంతా సాగు చేసుకునే వీలుంటుంది.
పట్టుగూళ్లకు ప్రపంచ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కానీ ఉత్పత్తిలో మన వాటా 10 శాతం మాత్రమే ఉన్నది. మన దేశంలో పట్టు వినియోగం ఎక్కువగా, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. భారత్లో అధికంగా కర్ణాటకలో 3 లక్షల ఎకరాల్లో, ఏపీలో 80 వేలనుంచి 90 వేల ఎకరాల్లో, తమిళనాడులో 20 వేల నుంచి 25 వేల ఎకరాల్లోనే ఈ పంట సాగవుతున్నది. ఇక తెలంగాణలో కేవలం 10 వేల ఎకరాల్లోపే మల్బరీ సాగవుతున్నది. ఈ నేపథ్యంలో పట్టుగూళ్లకు భారీగా ధర పలుకుతున్నది. రెండు నెలల క్రితం కేజీ పట్టుగూళ్ల ధర రూ.450 పలికింది. కరోనా కన్నాముందు ఏకంగా రూ.550 దాకా చేరుకున్నది. ప్రస్తుత సంక్షోభంలోనూ రూ.300లకు పైగా ధర వస్తున్నది. దీంతో రైతుకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉన్నది.
ప్రపంచ వ్యాప్తంగా ‘బై వోల్టింగ్ సిల్క్’కు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ రకం పట్టు ఉత్పత్తికి డిమాండ్ ఉన్నది. మన రాష్ట్రం కూడా ‘బై వోల్టింగ్ సిల్క్’ ఉత్పత్తిలో నంబర్వన్గా కొనసాగుతున్నది. అత్యంత నాణ్యమైన పట్టును ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగానూ నిలిచింది. ఇందుకుగాను కేంద్రం నుంచి 2019లో అవార్డుకూడా దక్కించుకున్నది. ఈ విధంగా పట్టు పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉంటుందని నిపుణులు తేల్చారు. ఇతర ప్రాంతాల్లో కేవలం నాలుగునుంచి ఐదు పంటలు తీస్తే, తెలంగాణలో 6-10 పంటలు తీసే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
పట్టు పురుగులను పెంచాలనుకునే రైతులు చాకీ సెంటర్లద్వారా కొనుగోలు చేయవచ్చు. 100 డీఎల్ఎఫ్ (డిసీస్ ఫ్రీ లేయింగ్) ధర రూ. 2,500గా ఉంటుంది. తెలంగాణలో వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్లలో ఐదునుంచి ఆరు చాకీ సెంటర్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో పట్టుగూళ్ల మార్కెటింగ్కూ ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి తిరుమలగిరి, జనగామలలో ప్రభుత్వం కకూన్ సెంటర్లలో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన కకూన్లను వ్యాపారులు పోటీపడి మరీ వేలంలో దక్కించుకుంటున్నారు. దీంతో మార్కెటింగ్ కూడా సులువుగా చేసుకొనే అవకాశం ఉంటుంది.
–స్వామిరెడ్డి కొమ్మిడి