నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా నకేరేకల్ లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అంతకుక్రితం వైకుంఠ దామం, రైతు వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఏడేండ్ల కిందట రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయో.. నేడు ఎలా ఉన్నాయో రైతులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో వ్యవసాయం చేద్దామంటే నీళ్లు, కరెంటు ఉండేవి కావన్నారు. నల్లగొండ జిల్లాలోని ముశంపల్లి గ్రామం గురించి సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు. ముశంపల్లి గ్రామంలో రాంరెడ్డి అనే రైతు 50కి పైగా బోర్లు వేస్తే చుక్కనీరు రాలేదు. గతంలో అష్టకష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే కనీసం మద్దతు ఉండేది కాదు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2018 నుంచి ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా అందించామన్నారు.
ధాన్యం దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రానికే దిక్సూచిగా మారింది. భారతదేశానికి మొత్తం తెలంగాణ దిక్సూచి అయితే 60 లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణకు నల్లగొండ జిల్లా దిక్సూచిగా అయిందన్నారు. వరిధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉందని ఎఫ్సీఐనే కితాబిచ్చిందని తెలిపారు. 26 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు.
రైతులను సంఘటితం చేసేందుకు, వారి సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికలను నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కరోనాలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుల కోసం సీఎం కేసీఆర్ పట్టుబట్టి మరీ 2,670 రైతు వేదికలను ఏర్పాటు చేయించారన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. దేశంలోని ఆయా రాష్ర్టాలు ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేస్తే.. ఆర్థిక సంక్షోభం ఉన్నా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలాగా దేశంలో ఎక్కడైనా వరిధాన్యం కొంటున్నారా? అని ప్రశ్నించారు.
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతు ఏ కారణం చేత మరణించినా రైతుబీమా లాంటి పథకం ఆదుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఏ ప్రాజెక్టునైనా కేంద్రం తీసుకొచ్చిందా? మిషన్ భగీరథకు నిధులివ్వాలని నీతిఆయోగ్ కేంద్రానికి సూచిస్తే స్పందనే లేదన్నారు. 65 ఏండ్లు ప్రజలు అధికారమిస్తే కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఆరున్నరేండ్లలో చేసి చూపించారని మంత్రి పేర్కొన్నారు.