హైబ్రీడ్ (ఆడ-మగ) వరి.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. సాగులో పెట్టుబడితోపాటు శ్రమకూడా కాస్తంత ఎక్కువైనా, అంతిమంగా అధిక లాభాలను తెచ్చిపెడుతున్నది. పలు విత్తనోత్పత్తి కంపెనీలు ఈ రకమైన వరిసాగును ప్రోత్సహిస్తుండటంతో అన్నదాతల్లోనూ ఆసక్తి పెరుగుతున్నది. ఫలితంగా మారుమూల పల్లెల్లోని రైతులూ ఈవైపు అడుగులేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా
ఒకప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన హైబ్రీడ్ (ఆడ-మగ) వరిసాగు, ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించింది. కాళేశ్వరం జలాలతో సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో మారుమూల పల్లెల్లోనూ సాగవుతున్నది. ముఖ్యంగా యాసంగి సీజన్లో ఆడ, మగ వరి విస్తృతంగా పండుతున్నది. ఈ పంటద్వారా అధిక లాభాలు వస్తుండటంతో రైతులూ ఆసక్తి కనబరుస్తున్నారు. పలు ప్రైవేట్ విత్తనోత్పత్తి కంపెనీలు విత్తనాలు మొదలుకొని సాగుకు కావాల్సిన సలహాలు, సూచనలు, అన్ని రకాల మందులను అందిస్తున్నాయి. అంతేకాకుండా, అధిక ధర చెల్లిస్తూ దిగుబడులను కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా చాలామంది రైతులు ఆడ, మగ వరిసాగును ఎంచుకుంటున్నారు. సాధారణ వరిసాగుతో పోలిస్తే, ఇందులో కొంత కష్టం ఉన్నా, అధిక లాభాలు తెచ్చి పెడుతుండటంతో హైబ్రీడ్ సాగువైపే మొగ్గు చూపుతున్నారు.
ఆడ, మగ వరి సాగులో విత్తనాల ఎంపిక కీలకం. బేయర్, సిన్జెంటా పాయనీర్, కావేరి, సుప్రీంతోపాటు మరికొన్ని కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, నేల రకంతోపాటు నీటి వసతిని దృష్టిలో ఉంచుకొని, తగిన రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎకరం పొలంలో ఆడ, మగ వరిని సాగు చేయడానికిగాను.. మూడు గుంటల్లో నారు మడిని సిద్ధం చేసుకోవాలి. అందులో మూడు కేజీల సూపర్, మూడు కేజీల దుక్కి మందు, కేజీ పొటాష్ చల్లుకోవాలి. ఆరు కిలోల ఆడ రకం విత్తనాలు, మూడు కిలోల మగ రకం విత్తనాలతో నారు పోసుకోవాలి. ఆడ, మగ విత్తనాలు కలువకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వేరువేరుగా నారు పెంచుకోవాలి. మగ విత్తనాలు అలికిన 5, 6 రోజుల తర్వాత ఆడ విత్తనాలను అలుకుడు చేయాలి. ఎనిమిది రోజుల తర్వాత నారు మడికి 10 కేజీల వరకూ గుళికలు వేయాలి.
28 నుండి 35 రోజుల నారును నాటుకోసం ఉపయోగించాలి. మగ నారు సాల్ల మధ్య, ఆరునుంచి ఎనిమిది సాల్లు ఆడ నారు వేసుకోవాలి. విత్తనాల రకాలనుబట్టి మగ నారు సాల్ల నడుమ నిర్దిష్టమైన దూరం ఉండేలా చూసుకోవాలి. నాటు వేసిన ఐదు రోజులకు కలుపు మందు చల్లాలి. 15 రోజుల తర్వాత ఎకరానికి 100 కేజీల దుక్కి మందు, 25 కేజీల యూరియా వేసుకోవాలి. 30 రోజుల తర్వాత 25 కేజీల యూరియా, 45 రోజుల తర్వాత 25 కేజీల యూరియా, 25 కేజీల పొటాష్ వేయాల్సి ఉంటుంది. చీడపీడల నివారణ కోసం పురుగు మందులను పిచికారీ చేయాలి.
వరి పొట్టదశలో ఆడ, మగ మొక్కలను క్రాసింగ్ (కలపడం) చేయాల్సి ఉంటుంది. ఆయా కంపెనీల ప్రతినిధుల సలహా మేరకు ఈ పని చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్రలు లేదా తాడు సాయంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటలోపు క్రాసింగ్ చేయాలి. రోజుకు నాలుగుసార్లు చొప్పున 15 రోజులపాటు క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను చేపట్టాలి. పంటకోతకు వచ్చినప్పుడు మొదటగా మగ వరిని కోయించాలి. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధుల సూచనలతో ఆడ వరిని యంత్రాల సాయంతో కోయాలి.
హైబ్రీడ్ వరిసాగులో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే ఎకరానికి ఏడు నుంచి పదిహేను క్వింటాళ్ల దాకా దిగుబడిని సాధించవచ్చు. ఆడ రకం వరి ధాన్యాన్ని ఆయా కంపెనీల ప్రతినిధులే కొనుగోలు చేస్తారు. ఇందుకోసం క్వింటాలుకు రూ.7వేల నుండి రూ.10వేల దాకా ధర చెల్లిస్తారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తారు. ఇక మగ వరినుంచి వచ్చిన దిగుబడిని రైతులే విక్రయించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఒక ఎకరం పొలంలో రూ.60 వేలనుంచి రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నది.
ఆడ, మగ వరి సాగుతో ఎక్కువ ఆదాయం వస్తుందని విన్నా. కొంచెం కష్టమైనా మంచి లాభాలు వస్తాయని ఎకరన్నరలో సాగు చేశా. ఈ రకం సాగులో ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటుంది. కంపెనీ వాళ్లు చెప్పినప్పుడు నీళ్లు పెట్టడం, మందులు వేయడం చేస్తున్నా. ఇప్పటిదాకా రూ.60వేల దాకా పెట్టుబడి పెట్టిన.
కొండవేణి సోమన్న, రైతు, చౌళ్లరామరం
-చిన్నం వెంకన్న