ఎర్నాకులం : వ్యవసాయం.. ఆరుగాలం కనిపెట్టుకుంటూ, కష్టించి పనిచేయాల్సిందే. అయినా పంట చేతికొచ్చే సమయానికి కొన్నిసార్లు ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వస్తుంటుంది. ఆ గండం దాటి దిగుబడులు చేతికొచ్చినా సొంతంగా మార్కెట్ చేసుకోలేని పరిస్థితుల నేపథ్యంలో దళారులకు ఎంతోకోకొంతకు ముట్టజెప్పాల్సిందే. చేసిన శ్రమకు వెల అటుంచి పెట్టుబడి పూడితే చాలు అదే పది వేలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందుకే అందరూ ఒకే రకమైన పంటల సాగు చేయకుండా, సీజన్కు అనుగుణంగా, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు, డిమాండ్ మేరకు వివిధ రకాల పంటల సాగువైపు మళ్లితేనే ప్రయోజనం అని నిపుణుల సలహాలు. అచ్చంగా ఇలానే ఆలోచించారు కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు.
సాధారణంగా ఓనం ఫెస్టివల్ సీజన్లో కేరళ తన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో పూలను దిగుమతి చేసుకుంటుంది. పది రోజుల పాటు కొనసాగే ఓనం పూల వేడుకలో ప్రధాన ఆకర్షణగా బంతిపూలు పెద్ద పాత్రే పోషిస్తాయి. రాష్ట్రంలో పూల కొరతను, డిమాండ్ను అధ్యయనం చేసిన ఎర్నాకులానికి చెందిన నలుగురు స్నేహితులు ఈ ఏడాది జూన్లో బంతి పూల సాగును చేపట్టారు.
హనీష్ శ్రీ హర్షన్, సీజీ జబిన్, సుజిత్ లాల్, పీవీ వినీత్.. ఈ నలుగురు స్నేహితులు కలిసి ఎకరం కంటే తక్కువ స్థలంలోనే 800 మొక్కలతో బంతిపూల సాగును చేపట్టారు. దిగుబడి ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో హోల్సేల్, రిటైల్ మార్కెట్లో పూలు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. మిగిలిన పూలను ఓనం వేడుకలో ప్రవితమైన రోజు తిరువోణం రోజున అమ్మేందుకు ప్రణాళికలు వేశారు.
హనీష్ మాట్లాడుతూ.. 2017-18లోనే తమ స్నేహితుల ద్వారా ఈ బంతిపూల సాగుపై ప్రేరణ పొందినట్లు తెలిపాడు. ఆర్థికంగా ప్రస్తుత పరిస్థితులు కష్టంగా ఉన్న ఈ సమయంలో కొంత అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు ఈ బంతిపూల సాగును చేపట్టినట్లు వెల్లడించాడు. డిమాండ్ను ఊహించి చేపట్టిన బంతిపూల సాగు తమకు మంచి ఫలితాలు ఇచ్చిందన్నాడు. సీజీ జిబిన్ మాట్లాడుతూ.. బంతిపూల సాగుతో తాము ఊహించని ఫలితాలు పొందినట్లు తెలిపాడు. అసలు తాము వ్యవసాయం చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. బెంగళూరులో పనిచేసే సుజిత్లాల్ మాట్లాడుతూ.. పూలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కిలో రూ.150 చొప్పున విక్రయించడంతో తాము మంచి లాభాలు ఆర్జించినట్లు తెలిపాడు.