ఒకప్పుడు, విదేశాల్లోనే కనిపించిన డ్రాగన్ ఫ్రూట్.. నేడు తెలంగాణలోనూ విరగ పండుతున్నది. మార్కెట్లో మంచి
గిరాకీతో.. అన్నదాతకు ఆదాయాన్నిస్తున్నది. ‘శ్రమ తక్కువ.. లాభాలు ఎక్కువ’ ఉండటంతో..
ఈ విదేశీ పండు సాగుకు రైతాంగం ఆసక్తి చూపుతున్నది.
ప్రజల అభి‘రుచులకు’ అనుగుణంగా.. రైతులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు పండ్ల తోటలంటే.. మామిడి, ద్రాక్ష, బత్తాయి, జామ మాత్రమే. ఇప్పుడు విదేశీ పండ్లనూ అలవోకగా పండిస్తున్నారు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఇక్కడి వాతావరణం అనుకూలమని తేలడంతో, రైతులు మరింత ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభ పెట్టుబడి ఎక్కువైనా.. ఇరవై ఏండ్లపాటు దిగు బడిని ఇస్తుండటంతో విరివిగా సాగు చేస్తున్నారు.
రకరకాలుగా..
ప్రస్తుతం, డ్రాగన్ ఫ్రూట్లో మూడు రకాలున్నాయి. ఒకటి తెలుపు (కామన్), రెండోది గులాబీ (రెడ్ ఫ్లెష్డ్ డ్రాగన్), మూడోది పసుపు (గోల్డెన్) రకాలు. వీటిలో కామన్ రకంలో తోలు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటూ.. లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. రెడ్ ఫ్లెష్డ్ డ్రాగన్లో తోలుతోపాటు గుజ్జుకూడా గులాబీ రంగులో వస్తుంది. ఇక గోల్డెన్ రకంలో తోలు పసుపు రంగులో, గుజ్జు తెల్లగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో తెలుపు, గులాబీ రంగు రకాలను సాగు చేస్తున్నారు.
స్తంభాలే ఆధారం
మార్కెట్లో ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ మొక్క రూ.25 నుంచి రూ.30కి దొరుకుతున్నాయి. ఈ మొక్కలు త్వరత్వరగా పెరుగుతాయి. కాబట్టే, అవి నిటారుగా ఎదగడానికి సిమెంటు లేదా రాతి స్తంభాలను ఆధారంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏడు అడుగుల స్తంభాలను తీసుకొని.. రెండు అడుగుల లోతులో పాతాలి. ఎకరానికి 450 నుండి 500 స్తంభాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో స్తంభం నడుమ ఎనిమిది నుండి 10 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి. ఈ స్తంభాలపైన మొక్కలు అల్లుకోవడానికి వీలుగా గుండ్రటి,చతురస్రాకారపు నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి స్తంభానికి నాలుగు వైపులా రెండు అడుగుల పొడవు-వెడల్పుతో, ఒక అడుగు లోతుతో గుంతలు తీసుకోవాలి. ఒక్కో గుంతలో 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేప పిండి వేసుకొని మొక్కలు నాటుకోవాలి. మొక్కలు కిందికి వాలి పోకుండా, స్తంభాన్ని పట్టుకొని గొడుగులా పెరిగేలా చూడాలి. ఇక యాజమాన్య పద్ధతుల్లోనూ తగిన జాగ్రత్తలు అవసరం.
యాజమాన్య పద్ధతులు..
డ్రాగన్ ఫ్రూట్ ఎడారి జాతికి చెందినది. కాబట్టి, నీటి అవసరం ఎక్కువగా ఉండదు. అయితే నేల రకాన్ని, సాగు రకాలను బట్టి నీటి తడులివ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ సాగులో చీడపీడల సమస్య చాలా తక్కువ. కాబట్టి, రసాయన మందులు వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కానీ, మొక్కలకు సరైన పోషకాలు పుష్కలంగా అందేలా చూసుకోవాలి. ఇందుకు ఏడాదిలో రెండుసార్లు (జూన్, జనవరిలో) పశువుల ఎరువు వేసి, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. రెండుమూడు నెలలకోసారి జీవ ఎరువులను కూడా చెట్లపై పిచికారీ చేసుకోవాలి. నేలలో సారం పెంచేందుకు వర్షకాలంలో చెట్ల మధ్య జనుము, పచ్చిరొట్ట పైరును పెంచి, నేలలో కలియదున్నాలి. మొక్కలకు సూర్యరశ్మి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. నీడ ఉండే ప్రాంతాల్లో ఈ మొక్కలు అంతగా పెరగవు. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పూత, పిందె రాలే ప్రమాదం ఉంటుంది.
పెట్టుబడి.. దిగుబడి ఎక్కువే!
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రారంభ పెట్టుబడి మాత్రమే ఎక్కువ. ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షల దాకా ఖర్చు వస్తుంది. అయితే, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూ.3.50 లక్షల సబ్సిడీ లభిస్తుంది. తర్వాత ఏడాది నుంచీ పెట్టుబడి పెద్దగా ఉండదు. ఈ మొక్కలను ఒకసారి నాటితే, 20 నుంచి 25 ఏండ్లపాటు దిగు బడిని ఇస్తూనే ఉంటాయి. మొకల వయసు పెరిగేకొద్దీ కొమ్మలు కూడా విస్తరిస్తూ ఉంటాయి. ఫలితంగా పండ్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొదటి ఏడాదికే ఐదు క్వింటాళ్ల నుంచి టన్ను దిగుబడి వస్తుంది. రెండో ఏడాది నుంచి రెండు టన్నులు, మూడో ఏడాది నుంచి నాలుగు టన్నులు, నాలుగో ఏడాది నుంచి ఏడు టన్నులు.. ఇలా దిగుబడి పెరుగుతూ వస్తుంది. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తెలుపు రకం కిలో రూ.150 నుండి రూ.200, పింక్ రకం కిలో రూ.200 నుండి రూ.250 దాకా పలుకుతుంది. ఈ లెక్కన ఎకరానికి మొదటి ఏడాదే రూ.1.5 లక్షల దాకా ఆదాయం వస్తుంది. రెండో ఏడాదికి పెట్టుబడి తిరిగొచ్చినా, మూడో ఏడాది నుంచి లాభాలు మొదలవుతాయి. డ్రాగన్ పండిస్తున్న రైతులంతా సంతోషంగా ఉన్నారు.
ఏ ఇబ్బందీ లేదు..
రెండేండ్ల క్రితం రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రారంభించా. ఇందుకోసం ఒకో స్తంభానికి రూ.280 చొప్పున వెయ్యి సిమెంట్ స్తంభాలను సొంతంగా తయారు చేయించా. గుంటూరు జిల్లా నుండి వెయ్యి మొకలు, వియత్నాం నుండి మూడు వేల మొకలు తీసుకొచ్చి నాటించా. ప్రారంభ పెట్టుబడిగా రూ.10 లక్షల దాకా ఖర్చు పెట్టా. మొదటి ఏడాదిలోనే రెండు క్వింటాళ్ల దిగుబడి సాధించా. రెండో ఏడాదిలో ఇప్పటికే రెండు టన్నుల దిగుబడి వచ్చింది. మరో రెండు టన్నులు వచ్చే అవకాశం ఉంది. చీడ పీడల సమస్యలేదు. మార్కెటింగ్కు కూడా ఇబ్బంది లేదు.
పద్మావతి, మహిళా రైతు, వెంకటాపురం.
లాభసాటిగా..
డ్రాగన్ ఫ్రూట్ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నాకున్న ఎనిమిదెకరాల్లో గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసేవాణ్ని. రాబడి తక్కువ ఉండటంతో విసిగిపోయి, వాణిజ్య పంటలపై దృష్టి పెట్టా. మొదటగా ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని నిర్ణయించా. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి, రూ.5 లక్షల ఖర్చుతో ఒక ఎకరంలో మొక్కలను నాటించా. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మొక్కల నుంచి స్టెమ్ కటింగ్ పద్ధతి ద్వారా మరో మూడెకరాలకు విస్తరించా. ఏడాదికేడాది దిగుబడి పెరుగుతూనే ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంతో మంది రైతులు మా పొలానికి క్షేత్ర పర్యటనకు వస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని అనుకొనేవారికి మొక్కలను కూడా అందిస్తున్నా.
జంగిలి కృష్ణమూర్తి, రైతు, రేపాకపల్లి