వేసవిలో కూరగాయలు, పండ్ల మొక్కలకు ‘డ్రిప్ పద్ధతి’లో సాగునీరు అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలంటున్నారు. దీనివల్ల ప్రతి మొక్కకూ నీరు అందుతుందనీ, సాగునీరు వృథా కాదని చెబుతున్నారు.
సంప్రదాయ పద్ధతి ద్వారా సాగునీరు పెడితే, మొక్కకు అందకముందే భూమి పీల్చుకుంటుంది. కావలసిన దానికన్నా అధిక మోతాదులో నీరు అందించినా, మొక్కలకు కీడే. ఫలితంగా మొక్కలు వాడిపోయి, ఎండిపోయే పరిస్థితి ఎదురవుతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
నేలను బట్టి
నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి నీరందించే వ్యవధి మారుతుంది. వేడి, పొడి వాతావరణం ఉండే వేసవిలో ఇసుక నేలలోనైతే రోజుకు మూడు సార్లు, తేలిక పాటి ఇసుక నేలల్లో ఒకటీరెండు రోజులకోసారి, ఒండ్రు మట్టి నేలలో రెండుమూడు రోజులకోసారి నీరు పెట్టవచ్చు.
అనేక లాభాలు
ఈ విధానం ద్వారా వివిధ పంటల్లో 21 నుంచి 50 శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల ఎదుగుదలకు అనుగుణంగా నీరు అందించడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి, త్వరగా పక్వానికి వస్తాయి. 100 శాతం నాణ్యమైన దిగుబడులు వస్తాయి. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ, ఎత్తు పల్లాలుగా ఉండే భూములు, కొండ ప్రాంతాలకు ఈ విధానం ఎంతో మేలు చేస్తుంది. నేలను చదును చేయడం, ఒడ్లు పెట్టడం, కాలువలు తవ్వడం, నీరు పారగట్టడం లాంటి పనులుండవు. వీటికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతి ద్వారా పంట వరసల మధ్యలో తేమ ఉండదు. ఫలితంగా కలుపు తగ్గుతుంది. 30 నుంచి 45 శాతం వరకూ విద్యుత్ వాడకం తగ్గుతుంది. వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల మందుల పిచికారీ, కత్తిరింపులు, పంటకోత సులభమవుతుంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్, స్పింక్లర్ పరికరాలు అందిస్తున్నది. షెడ్యూల్ కులాలు, తెగల రైతులకు వంద శాతం, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం వరకూ ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుంది.