‘దున్నకుండా సాగుచేస్తే.. కొయ్యకుండా పోతుంది!’ అనేదితెలుగు నానుడి. ఏ పంట వేయాలన్నా ముందుగా దుక్కి దున్నాల్సిందే!. విత్తేందుకు,నాటేందుకు అనుకూలంగా పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సిందే!.దుక్కి చేయకుండా వదిలేయడంవల్ల భూమి సత్తువ కోల్పోతుంది.చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. ముడి పోషకాలలోపం ఏర్పడి, తర్వాతి పంటకు భారీగా ఎరువులు వేయాల్సివస్తుంది. అందుకే.. రైతులు వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
యాసంగి సీజన్ ముగిసింది. ప్రస్తుతం పంట భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. భూసారం పెరిగేలా చర్యలు చేప్టటేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు చేయించుకొని, వానకాలం పంటకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనివల్ల వచ్చే పంటలో తెగుళ్లు, కలుపు నివారణకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. వేసవి దుక్కులతో రైతులకు దక్కే లాభాలను వివరిస్తున్నారు.
దున్నకపోతే తిప్పలే!
యాసంగి కోతల తర్వాత చాలామంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీనివల్ల ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. భూమికి సత్తువ లేకుండా చేసి, భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాననీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాల వల్ల భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
లాభాలే.. లాభాలు!
ఆయా నష్టాలను అధిగమించేందుకు వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి. తద్వారా భూమిలోపల కోశస్త దశలో ఉన్న హానికర పురుగులు, శిలీంధ్రాలు నశిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. భూమి పొరల్లో తేమ పెరుగుతుంది. ఆ తర్వాత వేసే పంట వేరు వ్యవస్థ నేల లోపలి పొరల్లోకి చొచ్చుకెళ్తుంది. తద్వారా పైరుకు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వర్షాలకు ముందే భూమిని దున్నడం వల్ల తొలకరి వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. భూమి కోతను నివారిస్తుంది. లోతు దుక్కులతో భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి.. నేల సారవంతంగా తయారవుతుంది. భూమిలో తేమశాతం పెరిగి, భూసారం అభివృద్ధి చెందుతుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో పశువుల పెంట, కంపోస్టు ఎరువులు, చెరువులు/ కుంటల్లోని మట్టిని వెదజల్లడం ద్వారా భూసారం మరింత పెరుగుతుంది. రాబోయే పంటల్లో అధిక దిగుబడులకు అవకాశం ఇస్తుంది.
చీడపీడలకు చెక్!
వేసవిలో చాలావరకు భూమి ఖాళీగానే ఉంటుంది. ఈ సమయంలో గత పంటలను ఆశించిన అనేక రకాల పురుగులు వాటి నిద్రావస్థ దశలను నేల, చెత్త, చెదారం, కొయ్య కాడల్లో గడుపుతాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు భూమి లోపలి పొరల్లో ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి దుక్కులతో నిద్రావస్థ దశలో ఉన్న చీడపురుగుల కోశాలు, గుడ్లు, లార్వాలు బయట పడతాయి. వాటిని పక్షులు, కొంగలు ఇతర పక్షులు తిని నాశనం చేస్తాయి. లోతుగా దున్నడం వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితోపాటు నేలపైకి వస్తాయి. బయటి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. ఇలా వేసవి దుక్కులతో రాబోయే పంటలను ఆశించే చీడపీడలకూ చెక్ పెట్టవచ్చు.
కలుపు నివారణకూ..
వేసవిలో భూములను అలాగే వదిలేయడం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా రాబోయే పంట సమయంలో కలుపు నివారణ అదనపు భారంగా మారుతుంది. పంట లేని సమయంలో పెరిగే కలుపు మొక్కలు భూమిలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహిస్తాయి. ఫలితంగా వచ్చే పంట దిగుబడి తగ్గుతుంది. అంతే కాకుండా అనేక రకాల పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయంగా ఉండటం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణం అవుతాయి. వేసవి లోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలు, వాటి విత్తనాలను సమూలంగా నిర్మూలించవచ్చు.
భూసార పరీక్షలు..
వేసవి దుక్కులతోపాటు భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం వల్ల నేల నిస్సారంగా మారిపోతున్నది. ఈ క్రమంలో భూసార పరీక్షలు చేయిస్తే మట్టిలో లోటుపాట్లు, ఆమ్ల/ క్షార గుణాలు తెలుస్తాయి. తద్వారా వానకాలంలో ఏఏ పంటలు సాగుచేయాలో, ఆయా పంటలకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వినియోగించాలో తెలుస్తుంది. దీనివల్ల అనవసర ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు సాగు ఖర్చులూ కలిసి వస్తాయి.
మూడు రకాలుగా..
వేసవి దుక్కులను లోతుగా, వాలుకు, అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహిస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వేసవి దుక్కులకు ముందు పొలంలో గొర్రెలు/ పశువుల మందలు తోలడం వల్ల వాటి విసర్జక వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మారి భూమిలోకి చేరుతాయి. భూసారవృద్ధికి తోడ్పడుతాయి. గత పంటకు సంబంధించిన ఆకులు, మొదళ్లు, చెత్తాచెదారం నేల పొరల్లో కలిసిపోయి, ఎరువుగా మారుతాయి. రాబోయే పంటకు కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తాయి.
నాణ్యమైన దిగుబడులు..
ప్రస్తుత పరిస్థితులలో పొలాలను చదును చేసి సేంద్రియ ఎరువులు చల్లుకోవాలి. తొలకరికి ముందే లోతు దుక్కులు దున్నుకొని, పొలాలను సాగుకు సిద్ధం చేసుకోవాలి. వర్షాధార మెట్ట వ్యవసాయంలో వాతావరణ అవరోధాలు, భూసారం, కలుపు సమస్యలు, సంప్రదాయ పద్ధతులు లాంటి అవరోధాలు దిగుబడిని దెబ్బతీస్తాయి. రైతులు ఎప్పటికప్పుడు సరికొత్త మెలకువలు పాటిస్తేనే అధిక దిగుబడులు పొందవచ్చు.
వేసవి లోతు దుక్కుల వల్ల ఇలాంటి అవరోధాలను అధిగమించవచ్చు. లోతు దుక్కుల వల్ల నేలలో నీరు ఇంకని పొరలు తొలగిపోతాయి. కురిసిన వర్షపు నీరు అక్కడికక్కడే నేలలోకి ఇంకిపోతుంది. వేసవిలో పగలు వేడి, రాత్రి చల్లదనానికి నేల గుల్లగా తయారవుతుంది. తర్వాతి పంటకాలంలో మొక్కల వేర్లు నేలలోపలి పొరలకు వెళ్లేలా సహకరిస్తుంది. పంటకు హాని కలిగించే పురుగులు, కలుపు మొక్కల విత్తనాలు కూడా నశించిపోతాయి. తొలకరి మొదలైన వెంటనే మరో పంట వేసుకోవడం సులభం అవుతుంది.
-మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి