ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తిలో తెలంగాణ వాటా కేవలం 3 శాతమే. పప్పు పంటలసాగులో రూపాయి పెట్టుబడి పెడితే మూడు నుంచి నాలుగు రూపాయల రాబడి వస్తుంది. మరే పంటపైనా ఇంత ఆదాయం సమకూరదు. అందుకే, ప్రభుత్వం పప్పుల సాగును ప్రోత్సహిస్తున్నది.
పంట పండిస్తే రైతన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి. అదంతా జరగాలంటే రైతు, డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. ప్రస్తుతం రైతులు భారీగా పండిస్తున్న వరితో పెద్దగా లాభం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో డిమాండ్ ఉన్న పప్పు దినుసులు పండిస్తేనే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రైతులు మరింత ఎక్కువగా పప్పులు సాగుచేయాల్సిన
అవసరం ఉంది.
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం.. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే పప్పు పంటలసాగు విస్తీర్ణంలో, ఉత్పత్తిలో తెలంగాణ వాటా మూడు శాతమే. గత రెండేండ్లలో రాష్ట్రంలో పప్పు పంటలసాగు గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా పప్పు దినుసుల అవసరాలు, సాగు, ఉత్పత్తి వంటి అంశాలపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) తాజాగా నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం పప్పు పంటల సాగు, ఉత్పత్తిలో రాజస్థాన్ తొలిస్థానంలో నిలిచింది. ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా 23 శాతం అయితే, తెలంగాణది 3 శాతం మాత్రమే. ప్రపంచంలో అధికంగా పప్పులు పండించేదీ, ఉపయోగించేదీ మనమే. అయినా, దేశీయ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. గత ఏడాది రూ.10వేల కోట్లకుపైగా విలువైన పప్పులు దిగుమతి చేసుకున్నాం. అయితే, మన అవసరాలకు ఏటా 26 మిలియన్ టన్నుల పప్పులు అవసరం. కానీ మన దగ్గరేమో 23 మిలియన్ టన్నుల పప్పులే ఉత్పత్తి అయ్యాయి.
దేశవ్యాప్తంగా పప్పు దినుసులకు ఉన్న డిమాండ్ను, కొరతను గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులను పప్పు పంటల సాగువైపు మళ్లించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే పప్పు పంటలు సాగుచేయాలని సీఎం కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. కంది, పెసర, శనగ పంటల సాగు పెంపుపై దృష్టిపెట్టారు. సీఎం చొరవతో రైతులు పప్పు పంటలను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. 2019-20లో రాష్ట్రంలో అన్నిరకాల పప్పు పంటలూ 9 లక్షల ఎకరాల్లో సాగైతే.. 2020-21 వానాకాలంలో అదికాస్త 13 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో కంది విస్తీర్ణం భారీగా పెరగడం గమనార్హం. అంతకుముందు ఏడాది కంది 7 లక్షల ఎకరాల్లో సాగు అయితే, గతేడాది సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ పంథాను ఇలాగే కొనసాగించేందుకు ఈ ఏడాది కందిని 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ఇతర వాణిజ్య పంటలతో బేరీజు వేస్తే.. పప్పు పంటల సాగుతో రైతుకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. అవసరానికి తగ్గట్టు పప్పులు అందుబాటులో లేకపోవడంతో నిత్యం డిమాండ్ ఉంటున్నది. పప్పు పంటల సాగులో రైతు రూపాయి పెట్టుబడి పెడితే రూ.3 నుంచి రూ.4 వరకు ఆదాయం వస్తుంది. మరే ఇతర పంటలోనూ ఇంతగా రాబడి రాదు.
రోజుకు ఒక్కొక్కరు సగటున 80-90 గ్రాముల పప్పులు తినాలి. కానీ, మనవద్ద 54.5 గ్రాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే, అవసరం కన్నా 30-35 గ్రాముల తక్కువగా ఉండటం గమనార్హం. ప్రతి సంవత్సరం ఒక వ్యక్తికి సుమారు 33 కేజీల పప్పులు అవసరం కాగా, మన వద్ద 19 కేజీల పప్పులే లభిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి వ్యక్తికి ఏటా 14 కిలోల పప్పులు తక్కువగా ఉన్నాయి. ఇక్రిశాట్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కేవలం 37శాతం మందే పప్పులు తింటున్నట్టు తేలింది.
స్వామిరెడ్డి కొమ్మిడి