రైతులు వ్యవసాయ బావుల నుంచి పంటలకు నీటిని పారించేందుకు, నీటిలో మునిగిపోయే సబ్మెర్సిబుల్ పంపు సెట్ను వినియోగిస్తారు. అయితే, నిత్యం నీటిలోనే ఉండే ఆ మోటారులోకి తరచూ ఒండ్రుమట్టి, నాచు వంటి వ్యర్థాలు చేరిపోతుంటాయి. ఫలితంగా మోటారు కాలిపోతూ ఉంటుంది. రిపేర్లు వస్తుంటాయి. ఆ మోటారు కూడా బావి గోడలకు ఆనుకొని, అడుగు భాగాన్ని తాకి ఉంటుంది. దీంతో, నీటి ప్రెషర్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ ఓ సాధారణ పంపు సెట్ మెకానిక్ పరిష్కారం కనిపెట్టాడు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ పంపు సెట్ల మెకానిక్.. రాజమోని పరమేశ్ చిన్న ఖర్చుతో పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. వ్యవసాయ బావులున్న రైతులు తరచూ మోటార్ల రిపేర్లతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా నీటిలో మునిగే సబ్ మెర్సిబుల్ పంపు సెట్లలోకి ఒండ్రుమట్టి, ఇసుక, నాచు, ఇతర వ్యర్థాలు వెళ్లి మోటారు పనితీరును దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు మోటారు కాలిపోతూ ఉంటుంది కూడా. బాగు చేసి తిరిగి అమర్చేందుకు నాలుగైదు వేల వరకూ ఖర్చు అవుతుంది. రాజమోని పరమేశ్ మాత్రం ఓ ఖాళీ డ్రమ్ముకు సబ్మెర్సిబుల్ మోటారును అమర్చి, బావి మధ్యలో వదిలేశాడు. అది నీటిలో తేలియాడుతూనే నీటిని పంపింగ్ చేస్తుంది.
ముఖ్యంగా మోటారు బురదలో కూరుకుపోయే సమస్యే ఉండదు. దీని వల్ల మోటారులోకి వ్యర్థాలు చేరిపోతాయన్న భయం అవసరం లేదు. అదీగాక, మోటారు బావిలో ఒక పక్క గోడకే ఆనుకొని ఉండటం వల్ల గతంలో నీరు సమృద్ధిగా పంపింగ్ అయ్యేది కాదు. ఈ ప్రయోగం ఫలితంగా ప్రెషర్ పెరుగుతున్నది. గంట అవసరమయ్యే చోట, 40 నిమిషాల్లో పంపింగ్ చేసుకొనే అవకాశం ఏర్పడింది. ‘ఈ చిట్కాను పదిహేను బావులకు ప్రయత్నించాను. అన్నీ విజయవంతంగా నడుస్తున్నాయి.
ఒక ఖాళీ డ్రమ్ముకు నీటి చుక్క దిగకుండా సీల్ చేసి, దానికి ఒక వైపు సబ్మెర్సిబుల్ మోటారును అమర్చి, మోటారు నీటిలోకి జారి పడిపోకుండా బలమైన తాళ్లను కట్టి, నీటి మధ్యలో వదిలితే చాలు. ఇందుకు మెకానిక్ చార్జీ సహా మొత్తం రూ.3 వేలు ఖర్చవుతుంది. మోటారు తేలియాడుతూ ఉండటం వల్ల, బావిలో నీటి మోతాదు కూడా మనకు తెలిసిపోతుంది. మోటారు బురదలో కూరుకపోదు. పంపింగ్ సామర్థ్యమూ పెరుగుతుంది. దీన్ని సులభంగా ఎటువైపు అయినా తిప్పుకోవచ్చు. అవసరమైతే మోటారును సులభంగానే బయటకు తీయొచ్చు’ అంటాడు మెకానిక్ పరమేశ్.