వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘కూలీల కొరత’ రైతులను ఎక్కువగా పట్టి పీడిస్తున్నది.
ఈ సమస్యనుంచి అన్నదాతను గట్టెక్కించడానికి వచ్చిందే ‘వెదజల్లే పద్ధతి’. మొలకలను వెదజల్లే పద్ధతి వరి సాగులో వచ్చిన మరో విప్లవాత్మక మార్పు. ఈ విధానంలో సాగుద్వారా రైతుకు అనేక లాభాలున్నాయి. కూలీల కొరతను అధిగమించడంతోపాటు పెట్టుబడి ఖర్చూ భారీగా తగ్గనున్నది. అంతేకాక, సంప్రదాయ పద్ధతితో పోలిస్తే దిగుబడికూడా పెరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు రైతులు ఈ పద్ధతిలో వరిసాగు చేస్తూ, అధిక లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వమూ ఈ నూతన విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. శాస్త్రవేత్తలుకూడా ‘వెదజల్లే పద్ధతి’ని పాటించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు ఎలా చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
అలుకుడు చేసినట్లే..
మొలకలు వెదజల్లే పద్ధతి పూర్తిగా కొత్త విధానమేమీ కాదు. దీనిపై రైతులకు ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ప్రస్తుతం సాధారణ పద్ధతిలోనూ నారు పోసేందుకు (వడ్లు అలుకుడుకు) ఈ విధానాన్నే అమలు చేస్తున్నారు. నారుమడి కోసం ఎలాంటి పద్ధతులు పాటిస్తారో వెదజల్లే విధాన వరిసాగుకూ అవే పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. కాకుంటే, నారుకోసం ఒక పెద్దమడిలో ఓ మూలకు మొలకలను వేస్తే, ఈ కొత్త విధానంలో మడి మొత్తానికి వేయాల్సి ఉంటుంది.
మొలకలు సిద్ధం
సాధారణ పద్ధతిలో మాదిరిగానే 24 గంటలపాటు విత్తన వడ్లను నాన పెట్టుకోవాలి. తర్వాత, అవి మొలకలు వచ్చేలా 48 గంటలపాటు మండెకట్టు కోవాలి. అయితే, ఎక్కువ మొలక రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మొలకలు ఎక్కువ వస్తే చల్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, తెల్లని మొనలు రాగానే విత్తనాలను విడదీస్తే, చల్లుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇలా విడదీసిన మొలకలను పొలంలో పలుచగా చల్లుకోవాలి.
పొలం తయారీ
ఈ కొత్త విధానంలోనూ సంప్రదాయ పద్ధతిలో మాదిరిగానే పొలాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, మొలకలను వెదజల్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ఎత్తు పల్లాలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడా నీళ్లు ఆగకుండా చదును చేసుకోవాలి. తర్వాత పొలంలోని నీళ్లు బయటకు వెళ్లేలా మధ్యమధ్యలో చిన్న కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ పొలంలో నీళ్లు అగితే, అక్కడ పడే విత్తనాలు మొలకెత్తకుండా మురిగిపోతాయి. మొలకలు వెదజల్లేటప్పుడు నీళ్లు సరిసమానంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎక్కువ నీళ్లుంటే విత్తనాలు ఒకచోటు నుంచి మరో చోటుకి కొట్టుకుపోతాయి. మరీ తక్కువగా ఉంటే బురదలో కూరుకుపోతాయి. కాబట్టి, బురదకన్నా కాస్త ఎక్కువగా నీరుంటే సరిపోతుంది.
నీళ్లు కట్టడం..
మొలకలు చల్లిన తర్వాత వారం పాటు పొలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజూ నీళ్లు పెడుతూ, తీస్తూ ఉండాలి. మొలకలు చల్లిన తర్వాతి రోజు కాలువలద్వారా మడిలోని నీటిని తీసేయాలి. తర్వాత రెండు రోజులపాటు ఆరబెట్టాలి. అంటే, నీళ్లు పెట్టకూడదు. ఇక మూడోరోజు మళ్లీ ఉదయం నీళ్లు పెట్టి సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం తీసేయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే విత్తనాలు పూర్తిగా మొలకెత్తుతాయి. ఆ పిమ్మట మొలకకు ఒక అంగుళం వరకు నీళ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా పదిహేను రోజులు జాగ్రత్తగా చూసుకుంటే పొలం మొత్తం సాధారణ పద్ధతిలో సాగు చేసినట్లుగానే మారిపోతుంది.
సస్యరక్షణ
వెదజల్లే విధానంలో ఎరువుల అవసరం కూడా తక్కువే. మొలకలు చల్లిన 15 రోజులకు డీఏపీ ఎరువు చల్లుకోవాలి. తర్వాత 20 నుంచి 25 రోజుల మధ్యలో కలుపు మందు పిచికారీ చేసుకోవాలి. నెల రోజులకు యూరియా వేసుకోవాలి.
అధిక దిగుబడి
సంప్రదాయ విధానంలో ఒక విత్తనానికి 15 నుంచి 20 పిలకలు వస్తే, వెదజల్లే పద్ధతిలో మాత్రం 25 నుంచి 30 పిలకలు వస్తాయి. ఫలితంగా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఒక్కో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా, సాధారణ పద్ధతిలో పోలిస్తే పంట కోతకూడా ముందుగానే వస్తుంది.
రూ.9 వేల దాకా ఆదా
వెదజల్లే విధానం ద్వారా ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకూ పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. విత్తనాలు, ఎరువులు, కూలీలు, దున్నడానికి.. ఇలా అనేక రకాలుగా ఖర్చులు తగ్గిపోతాయి. సాధారణ పద్ధతిలో ఎకరానికి 30నుంచి 35 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. కానీ, వెదజల్లే పద్ధతిలో 12నుంచి 14 కేజీలు సరిపోతాయి. అంటే, విత్తనాల ఖర్చు సగం తగ్గుతుంది. నారు మడి సిద్ధం చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అందుకయ్యే రూ.వెయ్యి దాకా ఖర్చులు మిగులుతాయి. ఇక రైతు అత్యధికంగా ఖర్చు పెట్టేది నాటు వేయడానికే. ఒక ఎకరం నాటు వేసేందుకు 15 మంది కూలీలు అవసరమవుతారు. ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.400 దాకా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, కూలీలకే రూ. 6 వేల వరకూ ఖర్చవుతుంది. కానీ, ఈ కొత్త పద్ధతిలో కూలీల అవసరమే ఉండదు కాబట్టి రైతుకు రూ. 6 వేలకు పైగా మిగులుతాయి.
ఎంతో బాగుంది
ఏడాదినుంచి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నా. నాటు వేసే పద్ధతికన్నా ఇదెంతో బాగుంది. సమయం, పెట్టుబడి ఖర్చు ఆదా అవుతున్నది. సాధారణ పద్ధతిలో సాగు చేసిన దానికన్నా వరి మంచిగా ఎదిగింది. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మా ఊర్లో చాలామంది ఈ వెదజల్లే పద్ధతిలోనే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్వామిరెడ్డి కొమ్మిడి