ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన ప్రాంతమది. ఎన్ని బోర్లు వేసినా, చుక్కనీరు పడని ఊరది. వంద గడపలున్న ఆ పల్లెలో.. అన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే! వారంతా చిన్న, సన్నకారు రైతులే! వరి వేయలేక.. పత్తిలాంటి వాణిజ్య పంటలతో నష్టపోయినవారే! కానీ, ఒకే ఒక పంట.. వారి తలరాతనే మార్చింది. మామూలు రైతులను.. భాగ్యనగరానికి ‘మిర్చి’ సరఫరా చేసే స్థాయికి చేర్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఎన్జీ బండల్ (నల్ల గొంటోని బండల్) గ్రామం, మిర్చీ సాగులో దూసుకెళ్తున్నది. ఒకప్పుడు సరైన పంటలు లేక అష్టకష్టాలు పడ్డ అక్కడి రైతాంగం.. ‘మిరప’ సాగుతో తమ దశను మార్చుకొన్నది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రధాన మార్కెట్లకు పెద్ద ఎత్తున మిర్చిని సరఫరా చేస్తున్నది. వీరారెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామంలో వందకుపైగా ముదిరాజ్ కుటుంబాలు ఉన్నాయి. గతంలో వీరంతా అందరిలాగే వరి, పత్తిలాంటి పంటలను సాగు చేసేవారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బోర్లలోనూ అంతంత మాత్రంగానే నీరు ఉండేది. దీంతో దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూశారు. ఆ తర్వాత సీజన్ను బట్టి ఆరుతడి పంటలు పండించేవారు. ఆదాయం కోసం నెలల కొద్దీ వేచి చూడకుండా, రోజువారీ ఆదాయం పొందే మార్గాన్ని ఎంచుకొన్నారు. అలా ఒకరివెంట ఒకరు ‘మిర్చి సాగు’ దిశగా అడుగులు వేశారు.
గ్రామం మొత్తం మీద 102 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు. మరో 70 ఎకరాల్లో చిక్కుడు, బెండ, వంకాయలాంటి కూరగాయలను అంతర పంటగా పండిస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే, మిర్చి సాగుకు నీటితోపాటు పెట్టుబడుల ఖర్చూ తక్కువే! దీంతో రూపాయి పెట్టుబడితో మూడు రూపాయల లాభాన్ని పొందుతున్నారు. పెట్టుబడులు పోను ఎకరానికి రూ.50వేలకు పైగానే ఆర్జిస్తున్నారు. రైతులతోపాటు స్థానిక యువకులు కూడా మిర్చి పంటతోనే ఉపాధి పొందుతున్నారు. కూతవేటు దూరంలోనే ఉన్న భాగ్యనగరానికి మిర్చిని సరఫరా చేస్తున్నారు. కుషాయిగూడ, బోయిన్పల్లి మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మిర్చి సాగు లాభదాయకంగా ఉండటంతో.. పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లినవారు కూడా తిరిగి స్వగ్రామాలకు చేరుతున్నారు.
వరి, పత్తిలాంటి వాణిజ్య పంటలకు పెట్టుబడులు ఎక్కువ. పంట పండకుంటే నష్టం కూడా ఎక్కువే. ఆదాయం కోసం నెలల తరబడి వేచి చూడాలి. అదే, కూరగాయలైతే పెట్టుబడి తక్కువ. ఆదాయం కూడా వెంటనే వస్తుంది. అందులోనూ మిర్చి మరింత లాభం. అందుకే నాకున్న ఎకరం భూమిలో మిర్చితోపాటు అంతరపంటగా కూరగాయలు సాగు చేస్తున్నా. నెలకు ఎంతలేదన్నా.. రూ.40వేల నుంచి రూ.50వేల దాకా సంపాదిస్తున్నా.
కనకయ్య, రైతు.
ప్రజలు ఒక్కోరోజు ఒక్కో రకం కూరగాయలు కొంటారు. కానీ, ప్రతి వంటలోనూ మిర్చి అవసరం ఉంటుంది. కాబట్టి, ఇది నిత్యావసరంగా మారింది. దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అందుకే, పది గుంటల్లో మిర్చి వేసిన. మా ఇంటిల్లిపాదీ పొలంలో పనిచేసుకొంటం. పండిన మిర్చిని స్వయంగా అమ్ముకొంటం. దీంతో మాకు ఏ రోజుకారోజే సంపాదన వస్తుంది. ఇప్పుడు మా ఊర్లో మిర్చి సాగు చేయని రైతంటూ ఎవరూ లేరు.
బలరాం, రైతు.
గంజి ప్రదీప్ కుమార్