ముంబై: కరోనా మహమ్మారి బారినపడి బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమమాలిని సెక్రెటరీ మార్కండ్ మెహతా (80) మృతిచెందారు. ఈ విషయాన్ని హేమమాలిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాదాపు 40 ఏండ్లుగా నా కోసం అహర్నిశలు, అలుపెరుగకుండా కష్టపడి పనిచేసిన నా సెక్రెటరీ మార్కండ్ మెహతా మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. ఈ 40 ఏండ్లలో ఆయన మా కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు. కరోనా కారణంగా ఇప్పుడు ఆయనను కోల్పోయాం. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని హేమమాలిని ట్వీట్ చేశారు.
హేమమాలిని కుమార్తె ఇషా డియోల్ కూడా మార్కండ్ మెహతా మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన మా కుటుంబంలో ఒకరిలా మెలిగారని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. అంతేగాక విల్ మిస్ యూ అవర్ డియరెస్ట్ మెహతా అంకుల్ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఒకప్పటి బాలీవుడ్ తార రవీనా టాండన్, సింగర్ పంకజ్ ఉధాస్ కూడా మెహతా మృతికి సంతాపం తెలిపారు.