మట్టి వాసన తప్ప.. రసాయనాల మలినం ఎరుగని రైతు అతడు. పదేండ్లుగా ‘ప్రకృతి’తోనే పయనిస్తున్నాడు. సేంద్రియ సాగుతో ఆరోగ్యవంతమైన పంటలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకొన్నాడు. ఇటీవలే, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ‘జాతీయ స్థాయి హల్దార్ సేంద్రియ రైతు’ పురస్కారానికీ ఎంపికయ్యాడు. ‘నా పొలమే నాకు మార్కెట్ యార్డు. నేను చెప్పిందే రేటు’ అంటున్న ఆ ఆదర్శ రైతు.. బండారు వెంకటేశ్వర్లు.
బండారు వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం. విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. చిన్న జీతంతో కుటుంబం గడవడం కష్టం కావడంతో, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకొన్నాడు. తనకున్న 12 ఎకరాల్లో 2010 నుండి సేద్యం చేయడం మొదలు పెట్టాడు. అయితే, ఆ సమయంలో సరిపడా సాగునీరు లేకపోవడంతో.. బోర్లు వేయించి కొంతమేర వరి, వేరుశెనగ, పెసర తదితర ఆరుతడి పంటలు పండించేవాడు. నీటి కొరత కారణంగా దాదాపు ఆరు ఎకరాలు బీడుగానే ఉంచాడు.
‘పాలేకర్’తో మార్పు..
2014లో నల్లగొండలో సుభాష్ పాలేకర్ నిర్వహించిన కార్యక్రమానికి వెంకటేశ్వర్లు హాజరయ్యాడు. సేంద్రియ వ్యవసాయంపై పాలేకర్ ప్రసంగానికి ఆకర్షితుడై, ఈ వైపుగా దృష్టి పెట్టాడు. ప్రభుత్వం ద్వారా 50 శాతం సబ్సిడీతో ఫాంపాండ్, 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఏర్పాటు చేసుకొన్నాడు. అధికారుల సూచనల మేరకు చుక్క నీరు వృథా కాకుండా 12 ఎకరాల్లో పంటలు పండిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం రెండెకరాల్లో వరి, మిగతా భూమిలో బెండ, బీర, కాకర, దోస, కీరదోస, టమాట, మిర్చి, క్యాప్సికంతోపాటు స్వీట్కార్న్, బొప్పాయి వంటి పంటలు పండిస్తున్నాడు. ఎకరన్నరలో నిమ్మతోట వేశాడు. ప్రతి సీజన్లోనూ పంట మార్పిడి చేస్తూ, భూసారం కోల్పోకుండా చూస్తున్నాడు.
ఇంటి వద్దే మార్కెట్..
2014 నుంచి రసాయనాల వాసన తెలియకుండా వ్యవసాయం చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. గో ఆధారిత ఎరువుల కోసం రెండు ఆవులను కొన్నాడు. వాటి పేడ, మూత్రంతోపాటు పలు కషాయాలు వినియోగిస్తూ ఎరువులు తయారు చేసుకొంటున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సందర్శించారు. సాగు పద్ధతులను మెచ్చుకొన్నారు. దీంతో స్థానికంగా ఉండేవారు వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చిమరీ పంటలను కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా తానే ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నాడు వెంకటేశ్వర్లు. 12 ఎకరాల్లో ఏటా రూ.2 లక్షలు పెట్టుబడి ఖర్చులు పోను రూ.12 లక్షల ఆదాయం అందుకొంటున్నాడు.
అనేక అవార్డులు..
సేంద్రియ సాగుతో ఆరోగ్యవంతమైన పంటలు పండిస్తున్న వెంకటేశ్వర్లును పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఇటీవలే భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), ‘జాతీయ స్థాయి హల్దార్ సేంద్రియ రైతు’ పురస్కారం అందించింది. రాష్ట్ర స్థాయిలో ‘రైతు నేస్తం’ అవార్డు వరించింది. గడ్డిపల్లి కేవీకే నుంచి మూడుసార్లు ఉత్తమ రైతుగా, రైతు దినోత్సవం సందర్భంగా ‘పుడమిపుత్ర’ అవార్డు అందుకొన్నాడు.
ఆదాయం.. ఆరోగ్యం
వ్యవసాయంలో రసాయనాలు వద్దు.. కషాయాలే ముద్దు అనేది నా సిద్ధాంతం. సేంద్రియ సాగుతో మంచి ఆదాయం వస్తుంది. ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి.
సుభాష్ పాలేకర్ ప్రభావంతోపాటు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నేను సేంద్రియ సాగు చేస్తున్నా.
బండారు వెంకటేశ్వర్లు
గుండా శ్రీనివాస్ గుప్తా