సిద్దిపేట అర్బన్, జూన్ 23: పామాయిల్ తోటల సాగులో సిద్దిపేట నియోజకవర్గం ముందుడాలని, ఇందుకోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి రైతులు ముందుకొచ్చేలా చొరవ చూపాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వరి వెదసాగు, పామాయిల్ తోట పెంపకం, మల్బరీ తోటల సాగుపై అగ్రికల్చర్, సెరికల్చర్ అధికారులు, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సిద్దిపేట పట్టణంలోని ‘సుడా’ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 50వేల ఎకరాల పామాయిల్ సాగుకు లక్ష్యంగా చేసుకున్నామని, అందులో మొదటి సంవత్సరం 5వేల ఎకరాల్లో సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో జూన్, జూలై నెలలో వెయ్యి ఎకరాల సాగు లక్ష్యంగా శ్రమిస్తున్న ఉద్యావనశాఖ అధికారి రామలక్ష్మిని మంత్రి అభినందించారు. సెరికల్చర్ లాభదాయకమైన పంట అని, గ్రామాల్లో రైతులను మల్బరీ తోటలు సాగుచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారి 10 మంది రైతులతో మల్బరీ తోటల పెంపకం చేపట్టేలా ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. చంద్లాపూర్ క్లస్టర్లో 200 ఎకరాల లక్ష్యం ఉండగా, 36 ఎకరాల్లో పూర్తి కాగా, మిగతా 60 ఎకరాలు ఈ నెలలోపు పూర్తిచేసి, మరో 100 ఎకరాలు జూలైలో పూర్తి చేయాలని సూచించారు. విత్తన సాగు, ఆయిల్పామ్, వరి వెదసాగు, మల్బరీ తోటల పెంపకం, రైతుబంధు పడని వారి వివరాలు ఎప్పటికప్పుడూ ఇవ్వాలని, రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మొదటిసారిగా 50 వేల ఎకరాలు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేయడంపై వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ప్రశంసించారు.
ఇప్పటికే రైతుబంధు డబ్బులు 95శాతం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని, ప్రతి గ్రామంలో రైతుబంధు పడని రైతు ఉండద్దని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి రైతుకు రైతుబంధు చేరేలా అధికారులు చొరవ చూపాలన్నారు. వెద సాగులో వ్యవసాయ అధికారులు, ఏఈవోలు నిర్దేశించిన 25శాతం చేపట్టాలని ఆదేశించారు. వానకాలంలోపు నియోజకవర్గంలో 15 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా ఏఈవో, ఏవో, డీఏవో, స్థానిక ప్రజాప్రతినిధులు, సమన్వయంతో రైతులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. విత్తనోత్పత్తిపై కంపెనీ ఆర్గనైజర్లతో రైతులకు అవగాహన సమావేశాలు జరుపాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆదేశించారు.