ఎదులాపురం : నిందితులను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన కేసులను త్వరగా పూర్తి చేయడానికి సరైన సమయంలో సాక్షులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ డైరెక్టర్ కె. అజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం అధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లాఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి స్థానిక ముఖ్య కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. క్రిమినల్ కేసులు నమోదు అనంతరం పోలీస్ అధికారులు దర్యాప్తు సమయంలో ఎలాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలో అనే అంశాలను వివరించారు. సాక్ష్యాల సేకరణ , సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వేలిముద్రల సేకరణ , సంఘటన ప్రత్యేక సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా ఉంటాయని వెల్లడించారు.
తుది నివేదిక ఛార్జిషీట్ సమయంలో కేసుకు సంబంధించిన ప్రధాన అంశాలను క్రోడికరించి పటిష్టంగా సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. కోర్టు కేసుల్లోని నిందితులు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు స్వదేశానికి రప్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. న్యాయస్థానం సమయాన్ని వృథా చేయకుండా సాక్షులను, ఒకవేల నిందితులు జైల్లో రిమాండ్లో ఉంటే, ప్రత్యేక ఎస్కార్ట్ ద్వారా ప్రవేశ పెట్టాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ… కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన అంశాలపై ఎప్పటికప్పుడు ప్రాసిక్యూషన్ విభాగం వారితో తెలుసుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నమోదైన ప్రతి కేసు న్యాయస్థానంలో రుజువు కావడానికి ప్రణాళిక ప్రకారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. భౌతిక సాక్షం విఫలమైతే, సాంకేతిక పరిజ్ఞానంతో రుజువు చేయడానికి అవకాశం ఉందన్నారు. వేలి ముద్రల నిపుణులు, కంప్యూటర్ ఐటి కోర్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, సైంటిఫిక్ లేబరేటరీ, సీసీటీవీ కెమెరాలు ,తదితర అనేక అంశాలు దర్యాప్తులో సహకారం అందిస్తాయన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు కే. పురుషోత్తంచారి, పోతారం శ్రీనివాస్, రమేశ్బాబు, గుమ్మడి మల్లేశ్, కే. ప్రేమ్ కుమార్, సైదారావు, డీసీఆర్బీ సిఐ జాదవ్ గుణవంత్రావు, ఎస్ఐలు ఎం ఏ.హకీం, సయ్యద్ అన్వర్, ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు.