ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూగార్డెన్లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణం, మావల పరిధిలోని 135 మందికి రూ.75.83 లక్షలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు.
గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని అన్నారు. నిరుపేదల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగుల కోసం పెన్షన్లు,రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళితుల బంధు తదితర పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్తో పాటు పలువురు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.