ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే రూ.400కోట్లతో అధునాతనమైన టెక్నాలజీతో అతి పెద్దదైన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.2 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధునాతన టెక్నాలజీతో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో నేరాల శాతం తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్లో సైతం మున్సిపల్ నిధులు రూ.2 కోట్లతో ఈ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. దీనితోపాటు మరో రూ.20లక్షలతో భవన నిర్మాణం సైతం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుందన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో 130 సీసీ కెమెరాలు ఉండగా, మరో 420 సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయవచ్చని తెలిపారు. కొవిడ్ వైరస్ బారినపడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఫ్లోర్ లీడర్ సతీశ్, వార్డు కౌన్సిలర్ అర్చనరామ్ కుమార్, ఆయా వార్డు , టీఆర్ఎస్ నాయకులు , పోలీసులు తదితరులు పాల్గొన్నారు.