ఆదిలాబాద్ టౌన్ : ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు ఇప్పటికే పింఛన్లు అందజేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం దివ్యాంగులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగులను పట్టించుకునే వారే లేరని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం పిదప సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పింఛన్ను రూ.3వేలకు పెంచారని వెల్లడించారు. దివ్యాంగులకు డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో లక్షల మంది కుటుంబాలకు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, బీమా పథకాలు అసాధారణ పథకాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘం నాయకులు భావునే నగేశ్ ,ఉగ్గె నానయ్య, అఫ్సర్, సయ్యద్ , మోహన్ తదితరులున్నారు.