ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్లో ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొవిడ్ -19 ప్రభావిత రంగాలకు మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వం ముందుందన్నారు. ఈ సహాయం ఉపాధ్యాయుల ముఖాల్లో చిరునవ్వుకు కారణమౌతోందని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ఉపాధ్యాయులందరికీ నగదుతో పాటు బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సహాయం అందడంలో ఆలస్యం అయితే ఆందోళన చెందవద్దని అందరికీ అందుతాయని ఆయన పేర్కొన్నారు.