జైనథ్, సెప్టెంబర్ 30 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని పిప్పర్వాడలో మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. జైనథ్ మండలంలో నూతనంగా 1,296 పింఛన్లు మంజూరయ్యాయని, మిగిలిన 400 పింఛన్లు త్వరలోనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ధర్నాలకే మిగతా పార్టీలు పరిమితం
మన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి దేశమంతా ఇక్కడి పథకాల అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ధర్నాలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ మరో 20 ఏండ్ల పాటు అధికారంలో ఉంటుందని, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఆర్డీవో కిషన్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, ఏపీడీ అర్క చరణ్దాస్, ఎంపీడీవో గజానన్రావ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ఊశన్న, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెందూర్ దేవన్న, సర్పంచ్ నోముల సంతోష్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.