ఆదిలాబాద్ : కుల వృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే మత్సకారుల ఆర్థిక బలోపేతానికి 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులో సోమవారం అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆదుకునేలా 100 శాతం సబ్సిడీపై అందిస్తున్న చేప పిల్లలు వృద్ధిచెంది వాటి విక్రయాలతో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 కోట్ల చేపపిల్లలను సబ్సిడీపై అందించామని తెలిపారు. ఇందులో భాగంగానే సాత్నాల ప్రాజెక్టులో 2 లక్షల 60 వేల చేప పిల్లలు, లక్ష రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు.
అదేవిధంగా సాత్నాలలో ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రం సైతం ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకారుల కోసం టు వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందించామన్నారు. మత్స్యకారుల కోసం ఫిష్ మార్కెటింగ్ యూనిట్ బోథ్ మండల్ కజ్జర్ల లో ఏర్పాటు చేశామని, ఇంకా రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాల్ కూడా మంజూరు చేశామన్నారు. త్వరలో మత్స్యకారులకు మార్కెటింగ్ కోసం మ్యాథ్స్ టాటా ఏసీ వాహనాలు కూడా అందిస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, జైనథ్ ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, మండల రైతు సమితి అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, చంద్రయ్య, దేవన్న, అధికారులు, మత్స్యకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.